మెట్పల్లి రూరల్, ఆగస్టు 8 : విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో 12 వ్యవసాయ మోటర్లు కాలిపోయి అన్నదాతలకు తీవ్ర నష్టం సంభివించింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చౌలమద్ది శివారులోని ఇస్కాన్ ఆలయ సమీపంలో 33కేవీ సామర్థ్యం గల విద్యుత్తు స్తంభాన్ని సంబంధిత అధికారులు మూడు రోజుల క్రితం వేరేచోటుకు మార్చారు. దీనికి సమీపంలోనే ట్రాన్స్ఫార్మర్ నుంచి వ్యవసాయ మోటర్లకు వెళ్లే ఎల్టీ (లోటెన్షన్) లైన్ ఉంది. గాలికి 33కేవీ విద్యుత్తు తీగలు ఎల్టీలైన్ను తాకడంతో అధిక విద్యుత్తు ప్రవాహం జరిగి 12 మంది రైతులకు చెందిన 5 హెచ్పీ సామర్థ్యం గల వ్యవసాయ మోటర్లు, స్టార్టర్లు, ఫ్యూజులు కాలిపోయాయి.
వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లిన రైతులు తమ మోటర్లు కాలిపోవడాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. శనివారం మెట్పల్లి రూరల్ ట్రాన్స్కో ఇన్చార్జి ఏఈ రమేశ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి, 33కేవీ తీగలు ఎల్టీలైన్ను తాకడం వల్లే ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు. 33కేవీ తీగలు ఎల్టీ లైన్ను తాకకుండా తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. కాగా మోటర్లకు సంబంధించి పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.