కోల్కతా : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రక్రియలో రిగ్గింగ్ జరిగిందని వారు తమ పిటిషన్లలో ఆరోపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తర్వాత నలుగురు టీఎంసీ నాయకులు కోల్కతా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసి ఫలితాలను సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్ దాఖలు చేసిన వారిలో అలోరానీ సర్కార్, సంగ్రామ్ కుమార్ డోలై, మనస్ మజుందార్, శాంతిరామ్ మహతో ఉన్నారు. వీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ పిటిషన్లను హైకోర్టు వివిధ బెంచ్లు శుక్రవారం విచారించి.. తదుపరి విచారణను వాయిదా వేసింది.
అలోరానీ సర్కార్: బొంగావ్ అసెంబ్లీ సీటు నుంచి సర్కార్ పోటీ చేశారు. 2008 లో బీజేపీకి చెందిన స్వపన్ మజుందార్ చేతిలో ఓడిపోయారు. స్వపన్ మజుందార్ విద్యార్హత నకిలీ ధ్రువపత్రాలను సమర్పించారని ఆరోపణలు ఉన్నాయి. జస్టిస్ బిబెక్ చౌదరి ధర్మాసనం రెండు వారాల్లో అఫిడవిట్ సమర్పించాలని మజుందార్కు సూచించింది. తదుపరి విచారణ జూలై 16 న ఉండనున్నది.
సంగ్రామ్ కుమార్ డోలై: మోయినా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అశోక్ దిండా చేతిలో 1260 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓట్ల లెక్కింపులో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఫలితాన్ని పునః పరిశీలించాలని డోలై కోరారు. జస్టిస్ తీర్థంకర్ ఘోష్ ఈ పిటిషన్పై తదుపరి విచారణను జూన్ 25 కు వాయిదా వేశారు.
మనస్ మజుందార్: మజుందార్ టీఎంసీ టికెట్ మీద గోఘాట్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేశారు. బీజేపీకి చెందిన బిశ్వనాథ్ కరాక్ చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో కరాక్ క్రిమినల్ కేసులను దాచిపెట్టారని మజుందార్ ఆరోపించారు. ఈ కేసు తదుపరి విచారణను జస్టిస్ సావర్ ఘోష్ జూలై 9 కు వాయిదా వేశారు.
శాంతిరామ్ మహతో: బలరాంపూర్ అసెంబ్లీ సీటు నుంచి బీజేపీకి చెందిన బనేశ్వర్ మహాటో చేతిలో ఓటమిపాలయ్యారు. కేవలం 423 ఓట్లతోనే ఓడిపోయారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన జస్టిస్ సుభాషిష్ దాస్గుప్తా తదుపరి విచారణ జూలై 15 న చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇలాఉండగా, నందిగ్రామ్ స్థానం నుంచి ఎన్నికల్లో ఓడిపోయిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జూన్ 17 న కోల్కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి, ప్రతిపక్ష నాయకుడు సువేంధు అధికారి చేతిలో ఓడిపోయారు. నందిగ్రాంలో మొత్తం ఎన్నికల ప్రక్రియను సవాలు చేస్తూ మమతా బెనర్జీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై మరోసారి విచారణ జూన్ 24 న జరుగనున్నది. బెంగాల్లో ఎనిమిది దశల్లో జరిగిన ఎన్నికల తర్వాత మే 2 న ఫలితాలు వెలువడ్డాయి. నందిగ్రామ్లో సువేంధు అధికారి 1,956 ఓట్ల తేడాతో మమతా బెనర్జీపై విజయం సాధించారు. ఈ ఎన్నికలలో ఇది అతిపెద్ద తిరోగమనం.
రామ మందిరం విషయంలో మా ఎంపీవన్నీ అబద్దాలే
ఏడు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర క్యాబినెట్లో మార్పులు..!
చరిత్రలో ఈరోజు : ఈ అందమైన రైల్వే స్టేషన్కు 134 ఏండ్లు
ఇవీ మిల్కాసింగ్ ఆరోగ్య సూత్రాలు..!
చరిత్రలో ఈరోజు : హిందుత్వానికి ప్రతీకగా శివసేన ఆవిర్భావం
కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా అమెరికా మరో అడుగు
కిడ్నీ క్యాన్సర్ ఎలా వస్తుందంటే..?
అంత్యక్రియల వేళ తల్లి మాట విని లేచిన కొడుకు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..