ఆగ్రా : ప్రేమికులు, పర్యాటకులకు శుభవార్త. ప్రేమసౌధం తాజ్ మహల్ తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. రెండు నెలల కిందట కరోనా సెకండ్ వేవ్తో మూతపడిన చారిత్రక ప్రదేశం మళ్లీ పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నది. దేశంలో కరోనా కేసుల పెరుగుదలతో ఏప్రిల్లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆధీనంలోని స్మారక కట్టడాలు, మ్యూజియాలను మూసివేసింది. ప్రస్తుతం మహమ్మారి తీవ్రత తగ్గుతుండడంతో దేశవ్యాప్తంగా ఉన్న 3,693 చారిత్రక కట్టడాలు, 50 మ్యూజియంలు తిరిగి తెరవాలని నిర్ణయించింది. అయితే, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికే తాజ్ మహల్ను చూసేందుకు అనుమతి ఇస్తున్నారు.
ఒక ఫోన్ నంబర్ ద్వారా గరిష్ఠంగా ఐదు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుంటుందని, విడుతలో 650 మందిని తాజ్ మహల్ సందర్శనకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. స్మారక ప్రాంగణంలో రోజుకు మూడు సార్లు శానిటైజేషన్ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పర్యాటకులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడంతో పాటు సామాజిక దూరం నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు. అలాగే, పర్యాటకులకు తాజ్లో ఏ వస్తువులను తాకేందుకు అనుమతి లేదని అధికారులు చెప్పారు. పర్యాటకులు కరోనా మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని, మాస్క్ ధరించడం తప్పనిసరని ఏఎస్ఐ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..