హైదరాబాద్ : రాగల మూడు రోజుల్లో తెలంగాణ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. దీని ప్రభావంతో మంగళ, బుధ, గురువారాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని చెప్పింది. అలాగే ఈ నెల 23న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, వరంగల్ అర్బన్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.