భువనేశ్వర్ : పుట్టిన 15 రోజులకే కరోనా బారినపడిన నవజాత శిశువు పది రోజుల్లోనే మహమ్మారిపై విజయం సాధించింది. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్లో చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్లోని కలహండి జిల్లాకు చెందిన అగర్వాల్ భార్య ప్రీతి అగర్వాల్ (29) రాయ్పూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించింది. ఆ తర్వాత శిశువుకు జ్వరం రావడంతో అగర్వాల్ దంపతులు భువనేశ్వర్లోని జగన్నాథ్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. నవజాత శిశువుకు చికిత్స చేసిన నియోనటాలజిస్ట్ డాక్టర్ అరిజిత్ మోహపాత్ర మాట్లాడుతూ శిశువును తమ వద్దకు తీసుకువచ్చినప్పుడు అధిక జ్వరంతో, తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుందని పేర్కొన్నారు.
పలు చికిత్సలు చేసి, చివరికు వెంటిలెటర్పై ఉంచామని, రెమ్డెసివిర్తో సహా ఇతర యాంటీబయాటిక్స్ ఇచ్చినట్లు చెప్పారు. తల్లిదండ్రుల అనుమతితో రెమ్డెసివిర్ను ఇంజెక్షన్ ఇచ్చామని, ఎందుకంటే కొత్తగా పుట్టిన శిశువులపై పరిశోధనలు జరుగలేవని చెప్పారు. చివరకు చికిత్స సానుకూలంగా స్పందించి, కోలుకుందని మోహాపాత్ర పేర్కొన్నారు. ‘ఈ కేసు నా జీవితంలో ఒక ప్రత్యేక అనుభవం’ అవుతుందని పేర్కొన్నారు. పుట్టిన వెంటనే శిశువు వైరస్కు పాజిటివ్గా పరీక్షించడంతో తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యారు. పది రోజుల్లో శిశువు కోలుకుందని, ఇప్పుడు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.