న్యూఢిల్లీ : దేశంలో కరోనా పరిస్థితి, టీకా డ్రైవ్ ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష జరిపారు. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న వేళ తాజా పరిస్థితులు, వ్యాక్సిన్ పంపిణీపై ప్రధానమంత్రి ఉన్నతస్థాయి అధికారులతో వర్చువల్ విధానంలో చర్చలు జరిపారు. సమావేశానికి పీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఆరోగ్యమంత్రిత్వశాఖ సెక్రెటరీ తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. గత 24 గంటల్లో కొత్తగా 3,26,098 కేసులు నమోదయ్యాయి. మరో 3,890 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది. ఇందులో 2,04,32,898 మంది బాధితులు కోలుకోగా, 36,73,802 కేసులు యాక్టివ్ కేసులున్నాయని, వైరస్ బారినపడి మొత్తం 2,66,207 ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్యశాఖ తెలిపింది.
మరో వైపు అలాగే తౌక్టే తుఫాను నేపథ్యంలో చేపట్టిన చర్యలపై సైతం సాయంత్రం 5 గంటలకు ప్రధాని సమీక్ష నిర్వహించనున్నారు. తుఫాను హెచ్చరికలు, ముందస్తు చర్యలపై అధికారులతో మాట్లాడనున్నారు. తౌక్టే తుఫాను అమినీ దీవికి ఈశాన్య దిశగా 160 కిలోమీటర్ల దూరంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారుతుందని, ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి మరింత బలపడుతుందని పేర్కొంది. తదుపరి 12 గంటల్లో మరింత బలపడి అతితీవ్ర తుఫానుగా మారుతుందని, ఈ నెల 18న గుజరాత్ వద్ద రాత్రి 8.30గంటల మధ్య పోరుబందర్ – నలియా మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో 150-175 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అవకాశం ఉందని వివరించింది.