Talasani Srinivas Yadav | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తలసానికి స్వాగతం పలికారు. ముందుగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ఓం జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పుష్కలంగా వర్షాలు కురవాలని పంటలు పాడిపంట చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు అని పేర్కొన్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం, బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని చెప్పారు.
సమైక్య రాష్ట్రంలో బోనాల పండును పట్టించుకోలేదని తలసాని గుర్తుచేశారు. బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని డిమాండ్ ఉన్నప్పటికీ చేయలేదని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం లో మహంకాళి అమ్మవారి కి బంగారు బోనం సమర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.గోల్కొండ నుంచి లాల్దర్వాజ వరకు అంగరంగ వైభవంగా బోనాలు జరిపించారని పేర్కొన్నారు. లక్షలాది గా వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా నెల రోజుల నుండి అన్ని ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి భక్తులకు 100 సంవత్సరాల నుండి డెక్కన్ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో సేవలు అందిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
గత 30 ఏళ్లు నేను కీలకంగా ఉండి బోనాల పండుగను జరపిస్తున్నానని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రజలు, అధికారులు, సంస్థల సమస్వయంతో బ్రహ్మాండంగా చేస్తున్నామని పేర్కొన్నారు. ఒక పరంపరలా బోనాల పండుగ జరుపుతూ వస్తున్నామని చెప్పారు. మధ్యాహ్నం తొట్టెల ఊరేగింపు, ఫలహారం బండ్ల ఊరేగింపు ఉంటుందని అన్నారు. రేపు రంగం, అంబారీ ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రతి ఆర్గనైజర్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. అందరం కలిసి పండుగను జయప్రదం చేద్దామని పిలుపునిచ్చారు. బోనాలతో వస్తున్న అక్కాచెల్లెళ్లకు ఆటంకం కలగండా చూసుకుందామని సూచించారు.