జగిత్యాల : రాష్ట్రంలో రూ.40వేల కోట్లతో ఇంటింటికీ మంచినీళ్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. మంత్రి సోమవారం రాత్రి జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్లో పల్లెనిద్రలో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం గ్రామంలో పర్యటించారు. మురికి కాలువలు, ప్లాంటేషన్ను, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. అలాగే కల్లెడ గ్రామంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
గతంలో పెళ్లిళ్లకు మంగళసూత్రం, డబ్బులు కానుకలుగా ఇచ్చే వారన్నారు. సీఎం ప్రతి ఆడబిడ్డకు మేనమామగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు సరఫరా సరిగా లేక స్టార్టర్లు, మోటారు కాలిపోయే స్థితి నుంచి.. నేడు 24 గంటల కరెంటు అందించి పంట పొలాలకు జీవం పోసిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. రూ.10వేల కోట్లతో రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధి చేపట్టడం జరుగుతుందన్నారు. దళితుల అభివృద్ధికి రూ.10లక్షలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు.
రైతుబంధు కింద రూ.10వేల కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేసి వారికి ప్రభుత్వంగా ఆర్థికంగా దన్నుగా నిలిచిందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు సర్పంచులకు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా చెత్తతో ఎరువు తయారు చేస్తున్న సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శిని మంత్రి అభినందించారు. అనంతరం మంత్రి రాయికల్ మండలం అల్లీపూర్లో రైతువేదికను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్కుమార్, కలెక్టర్ రవి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.