న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 34,703 కొత్తగా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 111 రోజుల తర్వాత అతి తక్కువగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. రోజువారీ కేసుల కంటే ఎక్కువ మంది బాధితులు కోలుకుంటుండడంతో యాక్టివ్ కేసులు సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం 4.64లక్షలకు తగ్గి.. 101 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని చెప్పింది. తాజాగా వైరస్ నుంచి 51,864 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. మరో వైపు 553 మంది రోగులు వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు.
కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,19,932కు చేరింది. ఇందులో మొత్తం 2,97,52,294 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి 4,03,281 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 97.17శాతానికి పెరిగిందని తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.40శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.11శాతానికి పడిపోయిందని మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలో కరోనా టెస్టులు గణనీయంగా నిర్వహించినట్లు పేర్కొంది. సోమవారం నాటికి 42.14కోట్ల శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది. కరోనా టీకా డ్రైవ్లో భాగంగా మొత్తం 35,75,53,612 డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.