న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న హర్యానాలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. దీని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ప్రభావం కనిపించింది. రిక్టర్ స్కేల్పై 3.7 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రాత్రి 10.37 గంటల సమయంలో ఝజ్జర్కు ఉత్తరాన పది కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్సీఎస్ తెలిపింది. ఢిల్లీలో ఇంతకు ముందు జూన్ 20న పంజాబీ బాగ్ ప్రాంతంలో 2.1 తీవ్రతతో భూమి కంపించింది. సోమవారం రాత్రి సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం భయాందోళనకు గురయ్యారు. బయటకు పరుగులు పెట్టారు.
భూకంపం ధాటికి భవనాలు, ఇంట్లోని భారీ వస్తువులు సైతం కదిలాయని పలువురు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే, ఫాల్ట్లైన్కు దగ్గరగా ఉన్న ఢిల్లీలో భారీ భూకంపాలకు గురవుతుందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 12 నుంచి ఢిల్లీ నేషనల్క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) రెండు డజన్ల భూకంపాలను నమోదు చేసింది. నగరం సీస్మిక్ జోన్-4లోకి వస్తుందని, ఇది చాలా ఎక్కువ ముప్పు ఉన్న జోన్ అని తెలిపారు. ఢిల్లీలో రిక్టర్ స్కేల్పై 6 తీవ్రతతో భూమి కంపిస్తే భద్రతా నిబంధనలు పాటించని నిర్మాణాలు పెద్ద సంఖ్యలో కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.