కామారెడ్డి, జూలై 24: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతున్నది. పథకాల అమలులో ఘోరంగా విఫలమవుతున్నది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పెడతామని కాంగ్రెస్ సర్కారు ఆర్భాటంగా ప్రకటనలు చేసినా అమలు చేయడంలో తాత్సారం చేస్తున్నది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
బడికి వచ్చే పేద పిల్లల కడుపు నింపడమే లక్ష్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టారు. పొద్దున్నే లేచి తల్లిదండ్రులు పనులకు వెళ్తుంటే, ఆకలితో బడులకు వచ్చి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన బీఆర్ఎస్ అధినేత పాఠశాలల్లో భోజనం పెట్టాలని నిర్ణయించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకూ నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం అందించారు. అలాగే, ఉదయం పూట అల్పాహార పథకాన్ని కూడా ప్రారంభించారు. దీంతో అప్పట్లో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిర్యక్షంగా వ్యవహరించడంతో అల్పాహారం అటకెక్కింది. మధ్యాహ్న భోజన పథకం నాసిరకంగా మారిందన్న విమర్శలూ ఉన్నాయి. ఫలితంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పడిపోయింది.
అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో చేతులెత్తేసింది. పాఠశాలలతో పాటు కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించింది. కాలేజీ విద్యార్థులకు సైతం భోజనం పెడతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోని 20 ప్రభుత్వ కాలేజీల్లో 6,847 మంది చదువుతున్నారు. వీరిలో సింహభాగం దూర ప్రాంతాల నుంచి వచ్చి పోయే వారే. ఉదయం కాలేజీకి వస్తే సాయంత్రం తర్వాతే వారు ఇంటికి చేరుకునేది. ఈ క్రమంలో పస్తులుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు.. కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలైతే పగటిపూట తమ కడుపు నిండుతుందని సంతోషపడ్డారు. కానీ మధ్యాహ్న భోజనం అమలు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుండడంతో వారు నిరాశ చెందుతున్నారు. రేవంత్ సర్కారు గొప్పలు చెప్పుకోవడమే తప్ప అమలులో విఫలమవుతున్నదని విద్యార్థి సంఘాలు మండి పడుతున్నాయి.
జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథ కం అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. విద్యార్థులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. వెంటనే పౌష్టి కాహారంతో కూడిన భోజనాన్ని అందించాలి. కాంట్రాక్టర్లకు కాకుండా మధ్యాహ్న భోజన నిర్వాహకులకే అప్పగించాలి. విద్యార్థులకు భోజనం పెట్టకపోతే ఉద్యమం తప్పదు. – అరుణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను సరిగా పట్టించుకోవడం లేదు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి కూడా పలుమార్లు దీనిపై ప్రకటన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే కళాశాలల విద్యార్థులకు భోజనం ప్రారంభించాలి. ఎంతో మంది పేద విద్యార్థులు ఆకలితో కాలేజీలకు వస్తున్నారు. పస్తులుండడం వల్ల చదువులపై దృష్టి పెట్టలేక పోతున్నారు. ప్రభుత్వం వెంటనే మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలి.
– వినయ్, విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు
జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఇది పూర్తి కాగానే విద్యార్థుల వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపించాం. త్వరలోనే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తుంది.
– షేక్ సలాం, ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్, కామారెడ్డి