హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈనెల 22న ‘చలో లేబర్ ఆఫీస్’ ముట్టడికి పిలుపునిచ్చినట్టు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, ఈదురు వెంకన్న వెల్లడించారు. ఈ మేరకు వారు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆర్టీసీలో గుర్తింపు సంఘ ఎన్నికల ప్రక్రియ 5 నెలల ముందు ప్రారంభమైనా నేటికీ కొలిక్కి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఆర్టీసీ విలీనం చేయకుండా.. ఇటు గుర్తింపు సంఘం ఎన్నికలూ నిర్వహించకుండా ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తున్నదని మండిపడ్డారు. విలీన ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో ప్రతినెలా వందలాది మంది కార్మికులు రిటైర్ అవుతూ విలీన ఫలాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.