సిద్దిపేట, జూలై 24: సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో ఉద్యోగుల ఖాళీలతో పెండింగ్ పనులు ఎలా పూర్తవుతాయని, అభివృద్ధి పనులు ఎలా చేపడుతారని పబ్లిక్ హెల్త్ ఈఎన్సీతో స్థానిక ఎమ్మెల్యే హరీశ్రావు ఫోన్లో మాట్లాడారు.శుక్రవారం సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో హరీశ్రావు క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ.. నలుగురు ఏఈలకు ఒకరు ఉంటే పనులు ఎలా జరుగుతాయని, వెంటనే ఏఈలను నియమించాలని కోరారు.
పట్టణంలో యూజీడీ త్వరగా పూర్తి చేయాలని ఈఎన్సీని కోరారు. చెత్త సేకరణలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిన సిద్దిపేటలో ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ ఉండటం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. నర్సపూర్, ఎర్ర చెరువు పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఎల్లమ్మ గుడి వద్ద, విక్టరీ చౌరస్తా, నాసర్పురలో జంక్షన్ అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. కోమటి చెరువు ఎంట్రెన్స్ పారు అభివృద్ధి చేయాలని, కోమటి చెరువుపై పలు అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. పట్టణంలో నాలుగు వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని కోరారు. బీటీ,సీసీ రోడ్లు పూర్తి చేయాలన్నారు. వర్షాకాలం పారిశుధ్య నిర్వహణ పక్కాగా చేపట్టాలని హరీశ్రావు సూచించారు.