Death Studies : మనుషులు జీవితపు చివరి గడియల్లో మరణం సమీపిస్తున్న వేళ (End of The life) ఆశ్చర్యమైన అనుభవాలను ఎదుర్కొంటారట. కొందరికి ఒకే రకమైన కలలు (Dreams) వస్తుంటే.. మరికొందరికి ఒకే రకమైన దృశ్యాలు (Visuals) కళ్ల ముందు కదలాడుతాయట. ఈ కలలు, దృశ్యాలు కొందరిలో ఓదార్పును ఇచ్చేవిగా.. మరికొందరిలో ఆందోళన కలిగించేవిగా ఉంటాయట. తాజా అధ్యయనం (New Study) లో ఈ విషయం వెల్లడైంది.
ఇటలీలోని ఓ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. వారు ఆస్పత్రుల్లో నర్సులు, రోగులకు స్వచ్ఛంద సేవలు చేసేవాళ్లు, మనస్తత్వ శాస్త్రవేత్తలు సహా మొత్తం 239 మందిని ఈ అధ్యయనం కోసం ప్రశ్నించారు. మరణం సమీపిస్తున్న సమయాల్లో రోగులు వారికి చెప్పిన కలల గురించి, దృశ్యాల గురించి ఆరా తీశారు. ఈ అధ్యయనం వివరాలు ‘డెత్ స్టడీస్’ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ఆ అధ్యయనం ప్రకారం.. చాలా మంది రోగులు అప్పటికే మరణించిన తమ ప్రియమైనవారితో తిరిగి కలుస్తున్నట్లు కలలు వస్తున్నాయని చెప్పారట. మరికొందరు ఓ అద్భుతమైన ప్రదేశంలోకి తలుపులు తెరుచుకున్నట్లు, మెట్ల మార్గం ఆహ్వానిస్తున్నట్లు, ప్రకాశవంతమైన కాంతిలో తేలుతూ ముందుకు కదిలిపోతున్నట్లు, ఏదో కొత్త లోకానికి వెళ్లిపోతున్నట్టు దృశ్యాలు కనిపిస్తున్నాయని తెలిపారట. ఒక మహిళా రోగికి ఆఖరి క్షణాల్లో.. ‘నేను నీ కోసమే ఎదురు చూస్తున్నా రా..’ అని చనిపోయిన ఆమె భర్త పిలుస్తున్నట్టుగా కలలు వచ్చాయట.
మరో రోగికి దగదగలాడుతూ తెరుచుకుని ఉన్న ఓ ద్వారం వైపు చెప్పులు లేకుండా మెట్లు ఎక్కుతున్న భావన కలిగిందట. ఇంకో వ్యక్తికి ఒక తెల్లటి గుర్రం సముద్ర తీరం వెంబడి వేగంగా పరుగెత్తుతున్న దృశ్యాలు కనిపించాయట. అయితే అందరి కలలు, భావనలు ఇంత ప్రశాంతంగా ఉండవట. చావు భయం లేని వాళ్లకు మాత్రమే ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయట. కొందరికి వచ్చే కలలు, కనిపించే దృశ్యాలు భయంకరంగా ఆందోళన కలిగించేవిగా ఉంటాయట. మరణానికి సమీపంలో ఉన్న మరో వ్యక్తికి తన తల్లి ముఖాన్ని పోలిన ముఖంతో ఉన్న ఒక రాక్షసి తనను కిందికి లాగుతున్నట్లు కల వచ్చిందట. మరికొందరికి మృత్యువు తరుముతున్న భావన కలిగిందట. అయితే ఇలాంటి పీడకలను పోలిన దృశ్యాలు మరణభయం కలిగిన వారికి, బతుకుపై ఇంకా తీపి తగ్గని వారికి కనిపిస్తాయట.
అయితే ఆఖరి దశలో ఉన్న చాలామంది రోగులు తాము చెబితే నమ్మరేమోనని, తమ మాటను పట్టించుకుంటారో లేదోనని.. తమకు వచ్చిన కలల గురించి, ఊహాత్మకంగా కనిపించే దృశ్యాల గురించి చెప్పరనే సంగతిని తాను గమనించానని ఈ అధ్యయనం ప్రధాన పరిశోధకురాలు ఎలిసా రాబిట్టి చెప్పారు.