న్యూయార్క్: అమెరికాలోని లూజియానా రాష్ట్రంలో ఘోర కాల్పుల ఘటన(Louisiana shooting) జరిగింది. ఓ తండ్రి తన పిల్లల్ని చంపేశాడు. 8 మంది పిల్లలను గన్తో కాల్చి హతమార్చాడు. దాంట్లో ఏడు మంది చిన్నారులు అతని స్వంత పిల్లలే ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. లూజియానాలోని శ్రీవిపోర్ట్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. గడిచిన రెండేళ్లలో అమెరికాలో చోటుచేసుకున్న అత్యంత హేయమైన కాల్పుల ఘటనగా దీన్ని వర్ణిస్తున్నారు. నిందిత వ్యక్తిని 31 ఏళ్ల షామర్ ఎల్కిన్స్గా గుర్తించారు. అతను మొత్తం 8 మంది పిల్లలను కాల్పి చంపాడు. దీంట్లో అయిదుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు.
భార్యతో గొడవ పడ్డ అతను ఉదయం 6 గంటల సమయంలో కాల్పులకు తెగించినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది. బాధిత చిన్నారులు మూడేళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య వయసులో ఉంటారని భావిస్తున్నారు. చిన్నారులు నిద్రమత్తులో ఉన్నప్పుడు నిందితుడు వారిని తలలో షూట్ చేసినట్లు శ్రీవ్పోర్ట్ పోలీసులు వెల్లడించారు. ఏడు మంది చిన్నారుల మృతదేహాలను ఓ ఇంట్లో గుర్తించారు. ఇక మరో చిన్నారిని పారిపోతుండగా కాల్చినట్లు తెలుస్తోంది. తప్పించుకునేందుకు గోడ మీద నుంచి దూకిన మరో బాలుడు గాయపడ్డాడు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.
ముందుగా ఓ ఇంట్లో ఓ మహిళను షూట్ చేసిన నిందితుడు.. ఆ తర్వాత మరో ఇంట్లోకి వెళ్లి అక్కడ నిద్రిస్తున్న పిల్లల్ని హతమార్చాడు. చనిపోయిన ఏడు మంది పిల్లలకు తల్లి అయిన మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ కేసును గృహహింసగా పోలీసులు భావిస్తున్నారు. కానీ దేని వల్ల దాడి జరిగిందన్న విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఎల్కిన్స్ తన భార్యతో విడిపోతున్నట్లు తెలిసింది. ఆ ఇద్దరూ సోమవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నది. అయితే వేరుపడే అంశంపై వాగ్వాదం జరిగిన సమయంలో ఎల్కిన్స్ కాల్పులకు తెగించినట్లు తెలిసింది.
ఎల్కిన్స్ భార్యకు నలుగురు పిల్లలు కాగా, మరో మహిళతో అతను ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. అయితే అటాక్ జరిగిన సమయంలో పిల్లలు అందరూ ఒకే ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. 2019లో ఆయుధం కలిగి ఉన్న కేసులో నిందితుడు ఎల్కిన్స్ను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. తాజా ఘటన నేపథ్యంలో నిందితుడు ఎల్కిన్స్ను పోలీసులు కాల్చి చంపారు. అతను గతంలో లూజియానా ఆర్మీ నేషనల్ గార్డ్లో పనిచేశాడు.