కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఆగస్టు 11 : రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కొరకై భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13న జిల్లాలో జరిగే ఛలో కలెక్టరేట్ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద నాగకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ.10,814 కోట్లు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయని తక్షణమే వాటిని విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయిబర్స్మెంట్స్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో నిధులు అందలేదని విమర్శించారు. ప్రభుత్వ నిధులు విడుదల చేయకపోవడంతో ఆ భారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై మోపడం అన్యాయమన్నారు.
విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేసే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బకాయిలు విడుదల చేయకపోవడంతో ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువులకు దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఉన్నత విద్యను పేద విద్యార్థులకు అందుబాటులో ఉంచాలంటే స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ ను ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విడుదల చేసే విధంగా, శాశ్వతమైన నిధుల విడుదల వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ నాయకులు నాహిద్ పాషా, శ్రావణ్, మాహీర్ పాల్గొన్నారు.