చెన్నై : ఎలుకలు 12 బాటిళ్లలోని మద్యాన్ని ఖాళీ చేశాయి. అవును మీరు చదివింది నిజమే. ఈ విచిత్ర సంఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. నీలగిరి జిల్లా గుడలూర్ పట్టణ శివారులోని టాస్మాక్ దుకాణంలో చోటు చేసుకుంది. సోమవారం దుకాణం తెరిచిన సమయంలో మద్యం బాటిళ్లు ఖాళీగా ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) కదంపూజా ప్రాంతంలో మద్యం దుకాణం నిర్వహిస్తోంది. కరోనా లాక్డౌన్ కారణంగా దుకాణాన్ని సిబ్బంది మూసివేశారు.
సడలింపు ఇవ్వడంతో చాలా రోజుల తర్వాత సోమవారం దుకాణం తెరిచిన తెరువగా.. 12 బాటిళ్లు ఖాళీగా ఉన్నాయి. వాటిపై ఎలుకలు కొరికినట్లు గుర్తులు ఉన్నాయి. ఆ తర్వాత సదరు ఉద్యోగి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. టాస్మాక్ సీనియర్ అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తులో దుకాణం వద్ద ఎలుకలు ఉన్నట్లు గుర్తించారు. అవే సీసాల నుంచి మద్యం ఖాళీ చేశాయని తేల్చారు. ఒక్కో మద్యం బాటిల్ ధర రూ.1500 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.