హైదరాబాద్ : విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలలకు రావాల్సిన అవసరం లేదని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. జూలై ఒకటి నుంచి పాఠశాలల ప్రారంభంపై బుధవారం రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలల ప్రారంభంపై విద్యాశాఖ ఉన్నత న్యాయస్థానానికి వివరణ ఇచ్చింది. అన్ని తరగతుల విద్యార్థులు హాజరు కావాలా? అని కోర్టు ప్రశ్నించగా.. మూడ్రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పింది. తరగతి గదుల్లో ప్రత్యక్ష బోధనతో పాటు ఆన్లైన్ తరగతులు జరుగుతాయని కోర్టుకు తెలిపింది. విద్యాసంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టమని విచారణ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. హైకోర్టు అభిప్రాయాన్నీ దృష్టిలో ఉంచుకొని త్వరలోనే విధివిధానాలు ఖరారు చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా కోర్టుకు తెలిపారు. ఈ మేరకు వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యాశాఖను కోర్టు ఆదేశించింది.