న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ సమావేశ బుధవారం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉదయం 11గంటలకు జరుగుతుందని ఓ అధికారి తెలిపారు. కేంద్ర కేబినెట్ విస్తరణ ఊహాగానాల మధ్య సమావేశం జరుగుతోంది. ఇటీవల పీఎం మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వరుస సమావేశాలు నిర్వహించడం సంచలనంగా మారింది. దాదాపు నెల రోజుల నుంచి నడ్డా తరుచూ పీఎం నివాసానికి వెళ్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంతకు ముందు ఎన్డీఏ కూటమికి చెందిన పలు పార్టీలను కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు ఇంతకు ముందు తెలిపాయి.
2019లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రెండేళ్లయ్యింది. అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, సీరియర్ నేత జ్యోతిరాధిత్య సింధియా వంటి పలువురు సీనియర్ నాయకులకు కేంద్రం కేబినెట్ బర్తులు కల్పిస్తారని ఊహాగానాలున్నాయి. ఇటీవల ఉత్తరాఖండ్ మాజీ సీఎం తివేంద్ర సింగ్ రావత్ సైతం ప్రధానిని కలిశారు. శివసేన, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఎన్డీఏ నుంచి వైదొలిగాయి. అలాగే జన్ లోక్శక్తి పార్టీ నేత రామ్విలాస్ పాశ్వాన్ మరణించడంతో కేబినెట్లో పలు పదవులు ఖాళీ అయ్యాయి. ఈ సారి ఎన్డీఏ కూటమిలో జేడీ(యూ)కు సైతం మంత్రి పదవి లభిస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. యూపీ ఎన్నికల నేపథ్యంలో అప్నా దళ్ పార్టీ ఎంపీకి సైతం మంత్రి పదవి కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
ఆ పార్టీ నేత, ఎంపీ అనుప్రియ సైతం ఇటీవల కేంద్రహోం మంత్రి అమిత్షాను కలిశారు. ప్రస్తుతం చాలా మంది మంత్రులకు అదనపు శాఖలు అప్పగించారు. దీంతో వారికి భారంగా మారింది. కొత్తగా చేరే మంత్రులకు ఆయాశాఖల బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం జరుగుతోంది. సమీప భవిష్యత్లో బీజేపీ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో విస్తరణలో ఆయా ప్రాంతాలకు చెందిన వారికి కేబినెట్లో చోటు కల్పించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.