Mahua Moitra : ఇండిగో ఎయిర్లైన్స్ (IndiGo Airlines) కు చెందిన విమానంలో ఢిల్లీ వెళుతున్న తనను అయిదారుగురు పురుషులు వేధించినట్లు తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) గురువారం ఆరోపించారు. రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీసంఘం సమావేశంలో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు ఆమె ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టారు. అధికారిక విధుల్లో భాగంగా తాను 6E 719 విమానంలో ఢిల్లీకి బయలుదేరా. ఓ గుంపుగా ఎక్కిన అయిదారుగురు పురుషులు నావైపు అసభ్యంగా చూస్తూ వెనుక సీట్లవైపు వెళ్లారు.
విమానం దిగిన తర్వాత తాను డోర్ దగ్గర నిలబడి ఉండగా ఆ వ్యక్తులు హేళన చేస్తూ వీడియో చిత్రీకరించారని మహువా ఆరోపించారు. ఈ మేరకు తన ఎక్స్ పోస్టును పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి, ఇండిగో సంస్థకు మహువా జతచేశారు. ఆ వ్యక్తులను గుర్తించి ‘నో ఫ్లై’ జాబితాలో చేర్చాల్సిందిగా ఎయిర్లైన్ సంస్థకు ఫిర్యాదుచేశారు. ఈ ఘటనను పెద్దగా పట్టించుకోకుండా తాను సమావేశానికి వెళ్లిపోయానని, తర్వాత కొంతమంది సంఘీలు (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు) ఆ వీడియోను వైరల్ చేయడం చూసి ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు తెలిపారు. ‘ఇది బీజేపీ సంస్కృతి’ అంటూ ఆమె దుయ్యబట్టారు.