Kerala Election results : కేరళ (Kerala) లో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (LDF) ఘోర పరాజయం మూటగట్టుకోబోతోంది. వరుసగా మూడోసారి అధికారం తమదేనని భావించిన ఆ కూటమి ఆశలు అడియాశలయ్యాయి. కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకుగానూ ప్రతిపక్ష యూడీఎఫ్ (UDF) 90 కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి గెలుపు దాదాపు ఖరారు కావడంతో.. కాబోయే సీఎం ఎవరనే విషయంలో అప్పుడే చర్చ ఊపందుకుంది.
ఆ పార్టీ సీనియర్ నేత, తిరువనంపురం ఎంపీ శశీథరూర్కు సీఎం కుర్చీ దక్కే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందే ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సోషల్ మీడియా ఖాతా ప్రోఫైల్లో చేసిన మార్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు ముందు విజయన్ తన సోషల్ మీడియా (ఎక్స్, ఫేస్బుక్) ప్రోఫైల్స్లో కీలక మార్పు చేశారు. గతంలో ‘కేరళ ముఖ్యమంత్రి’ అని ఉండగా.. దానిని తొలగించి ఇప్పుడు కేవలం ‘పాలిట్ బ్యూరో సభ్యుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)’ అని మార్చుకున్నారు.
ఎన్నికల ఫలితాలు రాకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం అధికార మార్పిడికి ఖాయమని ఆయన ముందే తెలుసుకున్నారా..? ఫలితాలకు ముందే ఆయన ఓటమిని అంగీకరించారా..? అనే చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈసారి దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కేరళలో అధికార మార్పిడి జరుగుతుందని అంచనా వేశాయి. అధికార ఎల్డీఎఫ్ కూటమి వెనుకబడిందని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి స్పష్టమైన మెజారిటీ లభించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ అంచనాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి తన హోదాను సోషల్ మీడియా నుంచి తొలగించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.