హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండ్రోజుల పోలీస్ కస్టడీ అనంతరం ఆయనను శుక్రవారం ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో పోలీసులు కస్టడీలో తనపట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ న్యాయమూర్తి ఎదుట కృష్ణారెడ్డి కన్నీరు పెట్టుకున్నట్టు తెలిసింది. గత రెండ్రోజులుగా తనను అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు లేని ప్రదేశంలో విచారించారని, ఆ సమయంలో తనపట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారని వాపోయినట్టు సమాచారం. ఈ మేరకు తన న్యాయవాది సాయంతో అక్కడికక్కడే మరో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిసింది. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. సీసీ కెమెరాలు లేనిచోట నిందితుడిని ఎలా ప్రశ్నించారని ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు ఈ వ్యవహారంపై రెండ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కు మెమో జారీ చేసినట్టు సమాచారం.
ఉదయ్ కృష్ణారెడ్డి కస్టోడియల్ విచారణను హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేరుగా పర్యవేక్షించారు. గురువారం రాత్రి 9 గంటలకు అత్తాపూర్ పీఎస్కు వెళ్లిన సజ్జనార్.. రాత్రి 11.30 వరకూ అక్కడే ఉండి విచారణ తీరును పరిశీలించారని, ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పిన అంశాలపై మరింత లోతుగా ఆరా తీశారని తెలిసింది. ఈ విచారణ సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డిని కొట్టడంతోపాటు ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సీపీ కార్యాలయాన్ని ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా.. ఆ వార్తలన్నీ అవాస్తవాలని అక్కడి సిబ్బంది కొట్టిపారేశారు. వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయాలని హితవు పలికారు. కాగా, ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం.