Ajinkya Rahane | భారత క్రికెట్లో తనదైన ముద్ర వేసిన అజింక్య రహానే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్కు కూడా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దీంతో ఇక రహానే కోచ్గా, మెంటార్గా లేదా కామెంటేటర్గా కనిపిస్తాడని చాలామంది భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సీనియర్ క్రికెటర్ మరోసారి బ్యాట్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్-2026లో ఆడేందుకు రహానే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ లీగ్లోని అమ్స్టర్డామ్ ఫ్లేమ్స్ జట్టుతో అతడు ఒప్పందం చేసుకున్నట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. దీంతో రహానే కెరీర్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.
రహానేను తమ జట్టులో కీలక ఆటగాడిగా అమ్స్టర్డామ్ ఫ్లేమ్స్ యాజమాన్యం అభివర్ణించింది. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లో రహానేకు ఉన్న అపారమైన అనుభవం తమ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని ఫ్రాంచైజీ భావిస్తోంది. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనుంది. ఈ టోర్నీలో గ్లాస్గో, అమ్స్టర్డామ్, ఎడిన్బర్గ్, డబ్లిన్, బెల్ఫాస్ట్, రోటర్డామ్ నగరాలకు చెందిన ఆరు ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి.ఈ జట్టుకు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ యజమానులుగా వ్యవహరిస్తున్నారు. రహానే చేరికతో అమ్స్టర్డామ్ ఫ్లేమ్స్ జట్టుకు అనుభవం, నాయకత్వ లక్షణాలు మరింత బలపడతాయని మేనేజ్మెంట్ భావిస్తోంది.
2011లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రహానే.. భారత జట్టు సాధించిన ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో జట్టుకు నమ్మకమైన మిడిలార్డర్ బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 195 మ్యాచ్లు ఆడిన రహానే.. 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 38.46 సగటుతో 5,077 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లోనూ మూడు శతకాలు నమోదు చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులో నిలబడి జట్టును ఆదుకోవడంలో రహానేకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2023లో భారత్ తరఫున చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడిన ఆయన.. ఆ తర్వాత దేశవాళీ, ఫ్రాంచైజీ క్రికెట్లో తన ప్రయాణాన్ని కొనసాగించాడు.
ఐపీఎల్లో రహానేకు విశేష అనుభవం ఉంది. మొత్తం 212 మ్యాచ్లు ఆడిన ఈ సీనియర్ బ్యాటర్ 5,367 పరుగులు సాధించాడు. 2023లో ఐపీఎల్ టైటిల్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ రహానే సభ్యుడిగా ఉన్నాడు.2025, 2026 సీజన్లలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన రహానే.. తన నాయకత్వ సామర్థ్యాన్ని కూడా చాటుకున్నాడు. ఇప్పుడు యూరోపియన్ టీ20 లీగ్లో అమ్స్టర్డామ్ ఫ్లేమ్స్ తరఫున ఆడబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.