Viral News : ఆర్థిక అద్భుతాలకు, ఆధునిక జీవనశైలికి చిరునామాగా నిలిచే సింగపూర్ (Singapore).. ఇప్పుడు ఓ తీవ్రమైన సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఆ దేశంలో జననాల రేటు (Birth rate) రికార్డు స్థాయిలో పడిపోవడంతో సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం (Singapore Govt) రంగంలోకి దిగింది. పిల్లలను కనేందుకు యువతను ప్రోత్సహించే లక్ష్యంతో మునుపెన్నడూ లేని విధంగా ఓ భారీ ఫ్యామిలీ సపోర్టు ప్యాకేజీ (Family Support Package) ని ప్రకటించింది. ఈ పథకం కింద ఆ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు 17 ఏళ్లు నిండే వరకు దాదాపు 70,000 సింగపూర్ డాలర్లు (మన కరెన్సీలో రూ.55 లక్షలు) ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందనుంది.
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ జాతీయ దినోత్సవ ర్యాలీలో ఈ ప్రకటన చేశారు. దేశంలో సంతానోత్పత్తి రేటు 0.87 తో అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా యువత పిల్లలను కనేందుకు ముందుకు రాకపోవడంతో.. ఈసారి మరింత సమగ్రమైన విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే ఈ కొత్త ప్యాకేజీని కేవలం డబ్బుతో సరిపెట్టడం లేదు. కుటుంబాలపై భారం తగ్గించేలా అనేక అంశాలను ఇందులో చేర్చారు.
పుట్టిన ప్రతి బిడ్డకు ప్రభుత్వం 10,000 సింగపూర్ డాలర్ల (సుమారు రూ.7.8 లక్షలు) బేబీ గిఫ్ట్ ఇస్తుంది. దీనికి అదనంగా ‘ఫస్ట్ స్టెప్’ గ్రాంట్ కింద మరో 5,000 డాలర్లు (సుమారు రూ.4 లక్షలు) ఇస్తారు. బిడ్డ పెరుగుతున్న కొద్దీ ఏటా చైల్డ్ క్రెడిట్స్ రూపంలో 2,000 డాలర్లు (సుమారు రూ.1.6 లక్షలు) చొప్పున జమ చేస్తారు. వీటన్నింటితోపాటు శిశు సంరక్షణ (చైల్డ్ కేర్) కేంద్రాల్లో సబ్సిడీలను పెంచనున్నారు. తల్లిదండ్రులకు ఇచ్చే సెలవులను కూడా విస్తరించనున్నారు.
ప్రభుత్వం నిర్మించే ఇళ్ల (బిల్డ్-టు-ఆర్డర్ ఫ్లాట్స్) కేటాయింపుల్లో పిల్లలు ఉన్న కుటుంబాలకు అదనపు ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి బిడ్డకు లాటరీలో ఒక అదనపు అవకాశం లభిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కుటుంబ, సంతాన ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం సుమారు ఏడు బిలియన్ల సింగపూర్ డాలర్లు (సుమారు రూ. 5.5 వేల కోట్లు) ఖర్చు చేయనుంది. ‘మీరు పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంటే.. ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుందని ప్రతి కుటుంబం తెలుసుకోవాలి’ అని ప్రధాని వాంగ్ భరోసా ఇచ్చారు.
ఒకప్పుడు ‘ఇద్దరు చాలు’ అంటూ తీవ్రంగా ప్రచారం చేసిన సింగపూర్ ప్రభుత్వమే ఇప్పుడు పిల్లల కోసం ప్రాధేయపడాల్సిన పరిస్థితి రావడం గమనార్హం. 1970 లలో అధిక జనాభా దేశాభివృద్ధికి భారమని భావించిన ప్రభుత్వం 1987 నాటికి తన విధానాన్ని మార్చుకుంది. అప్పటి నుంచి జననాల రేటును పెంచేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు, ప్రసూతి సెలవులు వంటి ఎన్నో ప్రయత్నాలు చేసింది. విశ్వవిద్యాలయ పట్టభద్రులకు మ్యాచ్మేకింగ్ ఈవెంట్లు కూడా నిర్వహించింది. అయినా పరిస్థితి మారలేదు, సంతానోత్పత్తి రేటు పడిపోతూనే ఉంది.
ప్రభుత్వం ఇంత భారీగా డబ్బు వెదజల్లడానికి సిద్ధమైనా.. ఇది ఎంతవరకు ఫలిస్తుందనేది సందేహంగానే ఉంది. ఇటీవల వెలువడిన ఓ సర్వేలో దాదాపు మూడింట ఒక వంతు మంది యువత ఏ ప్రభుత్వ విధానం కూడా తమను పిల్లలను కనేలా ప్రోత్సహించజాలదని స్పష్టంచేశారు. ఖరీదైన జీవనం, పని ఒత్తిడి, పిల్లల పెంపకానికి అయ్యే అధిక ఖర్చులే తమను ఈ నిర్ణయానికి దూరం చేస్తున్నాయని చెబుతున్నారు. సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ యూజీన్ టాన్ ఈ చర్యలను ‘సింగపూర్కు లభించిన చివరి అవకాశం’ గా అభివర్ణించారు.
కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలే కాకుండా వివాహం, సంతానంపట్ల సమాజంలో ఉన్న దృక్పథాలు, మనస్తత్వాలు మారినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు దేశంలో వృద్ధుల జనాభా పెరిగిపోయి, పనిచేసే యువతరం తగ్గిపోతుండటంతో సింగపూర్ భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వలసదారులను ఆహ్వానించడం కూడా తప్పదని ప్రధాని వాంగ్ అలభిప్రాయపడ్డారు.