సిరిసిల్ల : జిల్లా కేంద్రంలో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కళాశాల భవనంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది, విద్యార్థులతో సీఎం కాసేపు ముచ్చటించారు. విద్యార్థినుల విద్య, వసతులపై వైద్యాధికారులను ఆరా తీశారు. రూ.36.45 కోట్ల సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఐదెకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం భవనం నిర్మించింది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని విద్యానగర్లోని అద్దె భవనంలో తాత్కాలికంగా తరగతులు చేపడుతున్నారు. అత్యాధునిక వసతులతో ప్రస్తుతం భవనం అందుబాటులోకి వచ్చింది. అధ్యాపకులు, అటెండర్లు.. తదితర 48పోస్టులను మంజూరు చేయగా, 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్ బైపీసీ చదివిన స్థానిక విద్యార్థినులకు సీట్లు కేటాయించేలా కేటీఆర్ చొరవ తీసుకున్నారు.