ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 26వ తేదీన గన్పార్క్కు తన రాజీనామా పత్రంతో వెళ్లకపోవటమే మంచిదైంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలుకు మళ్లీ మళ్లీ పెడుతున్న గడువులు, అన్నీ వట్టి మిథ్య అని ప్రజలకు దానితో తిరుగులేకుండా తేలిపోయింది. అదేవిధంగా ఆగస్టు 15 కొత్త గడువుతో దేవుళ్లపై వేసుకుంటున్న ఒట్లు అంతే అబద్ధమని కూడా ప్రజలకు అర్థమైపోయి ఉండాలి.
ప్రభుత్వం మాత్రం అస్పష్టమైన ప్రకటనలు చేయటం మినహా, హామీల అమలుపై ఆడిటింగ్ పద్ధతిలో లెక్కలేమీ చెప్పటం లేదు. కాకపోతే రెండు మాటలు మాత్రం అనుకోవాలి. రైతు రుణమాఫీకి, ఆరు గ్యారెంటీలలోని 13 హామీల అమలు హరీశ్ గుర్తు చేస్తున్న ఆగస్టు 15 గడువునైనా ఆమోదించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా లేరని ఇప్పుడు స్పష్టమవుతున్నది.
Telangana | రెండు తెలుగు రాష్ర్టాలలో సంచలనంగా మారిన ఆ ఉదంతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆ రోజున, రేవంత్రెడ్డి సవాలు ప్రకారమే తన రాజీనామా పత్రాన్ని అడ్వాన్సుగా వెంట తీసుకొని గన్పార్క్కు వచ్చారు. ఒకే విడతలో రూ.2 లక్షల రైతు రుణమాఫీని, ఆరు గ్యారెంటీలలోని మొత్తం 13 హామీలను ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన కొత్త గడువు ఆగస్టు 15లోగా అమలు పరిచినట్టయితే, తను తెచ్చిన రాజీనామా మీడియా వారి ద్వారా ఆటోమేటిక్గా స్పీకర్కు వెళ్లిపోతుందన్నారు. కానీ రేవంత్రెడ్డి హరీశ్కు సవాలు అయితే విసిరారు గాని, తన లేఖతో తాను స్వయంగా గన్పార్క్కు రాలేదు. కనీసం తన సిబ్బందితో అయినా పంపలేదు. ఈ వ్యాసం రాసే సమయానికి ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. దీన్ని బట్టి, ప్రజలకు ఆయన హామీలు, గడువులు అన్నీ మిథ్య, దేవుళ్లపై ఒట్లు వట్టి అబద్ధమని స్పష్టంగా అర్థమవుతున్నది. ఇదంతా ప్రజలు స్వయంగా టీవీ చానళ్లలో చూసిందే.
కాంగ్రెస్ హామీలపై ప్రజలకు అడుగుబొడుగు ఆశలు, భ్రమలు ఇంకా ఏమైనా మిగిలి ఉంటే, అవి శుక్రవారం నాడు ఈ విధంగా పటాపంచలై ఉండాలి. ఈ ఉదంతంపై రానున్న రోజుల్లో ప్రజల మధ్య ముమ్మరంగా చర్చలు జరుగుతాయి. ఇదంతా కాంగ్రెస్ పార్టీ, దానితో పాటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా కొని తెచ్చుకున్న ముప్పు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలతో అధికారానికి వచ్చిందని, కనుక ఇక్కడ కూడా అదేవిధంగా గ్యారెంటీలిస్తే గెలిచి తీరుతామని వారు నమ్మారు. కాని అందులో అనేకం అమలుకు సాధ్యం కావని పలువురు నిపుణులు, విజ్ఞులు కర్ణాటకలో చెప్పారు, తెలంగాణలో కూడా హెచ్చరించారు. కర్ణాటక ఎన్నికలు జరిగి ఈ నెలతో ఏడాది అవుతున్నది. అక్కడి హామీలు అనేకం ఇప్పటికీ అమలుకావటం లేదు. కొన్ని అరకొరగా మాత్రమే అమలవుతున్నాయి. దానితో ప్రజలలో నిరసనలు పెరుగుతున్నాయి. అప్పటి ఎన్నికల్లో అనేక ప్రజాసంఘాలు కలిసి కాంగ్రెస్కు మద్దతునిచ్చాయి. దానితో పాటు కాంగ్రెస్ గ్యారెంటీలు, అంతకుముందటి బీజేపీ ప్రభుత్వంపై ఉండిన వ్యతిరేకత కలిసి కాంగ్రెస్ను గెలిపించాయి. కానీ హామీలు నెరవేరకపోవటంతో అవే సామాజిక సంఘాలకు చెందిన ప్రముఖులు ఇప్పుడు అంటున్నదేమిటి? అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు కాంగ్రెస్కు ఇచ్చిన మద్దతు ఒక ‘కాంట్రాక్టు’ వంటిది. దాని ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలను అమలుపరచాలి. దానితో పాటు మంచి పరిపాలనను ఇవ్వాలి. అవినీతిని అరికట్టాలి. కాని, ఈ మూడింటిలో ఏదీ సరిగా జరగటం లేదు. హామీలకు నిధులు లేవని మంత్రులు స్వయంగా అంగీకరిస్తున్నారు. అందువల్ల ప్రజలకు కాంగ్రెస్తో ఏర్పడిన ‘కాంట్రాక్టు’ ముగిపోయినట్టే. ఈ స్థితిలో ప్రజలకు ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలనే నిర్ణయమైతే ఇంకా ఏమీ తీసుకోలేదు గాని, అసెంబ్లీ ఎన్నికలప్పటి వలె కాంగ్రెస్కు కట్టుబడి ఏమీ లేరు. సామాజిక సంఘాల ప్రముఖుల నుంచి వినవస్తున్న మాట ఇది.
తెలంగాణలో వరుసగా పదేండ్ల పాటు అధికారం లేక, ఏ విధంగానైనా గెలిచితీరాలని తపిస్తుండిన కాంగ్రెస్, కర్ణాటక తరహాలోనే వెనుక ముందు ఆలోచించకుండా అలవిగాని హామీలిచ్చింది. వాటి అమలుకు మొత్తం రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని, అంతకుమించి మరొక 50 శాతం నిధులు అవసరమవుతాయని, అవెక్కడ తెస్తారని, పరిపాలనకు కావలసిన తక్కిన ఖర్చుల మాటేమిటని, అభివృద్ధి పనులెట్లా అని, ఎన్నికల ప్రచారం సమయంలోనే ప్రశ్నలు వినిపించాయి. హామీలకు అయ్యే ఖర్చెంతో అంచనాలు చెప్పాలని ఆర్థిక నిపుణులు కాంగ్రెస్ను కోరారు. కానీ ఏమి చేసైనా సరే అధికారానికి రావాలనే ఆతృతలో ఉండిన పార్టీ నాయకత్వం దేనికీ జవాబివ్వలేదు. రకరకాల డిక్లరేషన్లు, మ్యానిఫెస్టోలు ఎడాపెడా ప్రకటించటమే గాక, పత్రికలలో పూర్తి పేజీ అడ్వర్టయిజ్మెంట్లతో, బహిరంగసభ ప్రసంగాలతో చాలా హడావుడి చేశారు. ఆరు గ్యారెంటీలు, 13 హామీలను గత ఎన్నికల ప్రచారాలలో ఎప్పుడూ ఏ పార్టీ చేయని విధంగా బాండ్పేపర్లపై రాసి ఇంటింటికి పంచిపెట్టారు. వాటిపై ప్రజలకు మరింత నమ్మకం కలిగించటం కోసం డిక్లరేషన్ పత్రాలను రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీలతో విడుదల చేయించారు. ఆరు గ్యారెంటీలను 100 రోజులలో అమలుపరిచే బాధ్యత స్వయంగా తనదంటూ సోనియాగాంధీతో రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాయించారు. అంతకుముందు వరకు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అనేక హామీలను గణనీయంగా పెంచివేసి, వాటికి కొత్త హామీలు చేర్చి, ప్రజలను నమ్మించటం వీటన్నింంటి ఉద్దేశం.
ఈ వ్యూహంతో కాంగ్రెస్ గెలిచిన మాట నిజమే. కానీ, ఆ వ్యూహమన్నది చివరికి కాంగ్రెస్ను తన గోయి తానే తవ్వుకునేట్టు చేసింది. అమలుచేయలేని ఆ హామీలు ముందు నుయ్యి వెనుక గొయ్యి వలె మా రాయి. కర్ణాటకలో జరుగుతున్నదే ఇక్కడ కూడా మొదలైంది. కర్ణాటక ప్రజా సంఘాల ప్రముఖులు అక్కడి పరిస్థితి గురించి అంటున్న విధంగానే, ఇక్కడ తెలంగాణలో కూడా ప్రజలకు కాంగ్రెస్తో అసెంబ్లీ ఎన్నికల నాటి ‘కాంట్రాక్ట్’ ముగిసిపోతున్నదనే అభిప్రాయం కలుగుతున్నది. అందుకు తార్కాణాలు ఒక్కొక్కటిగా కన్పిస్తున్నాయి కూడా. ఈ క్రమంలోని ఒక నాటకీయ పరిణామమే రేవంత్రెడ్డి, హరీశ్రావుల మధ్య సాగిన సవాళ్లు, ప్రతి సవాళ్లు, గన్పార్క్ ఉదంతాలు.
తేదీలు ప్రకటించి మరీ ప్రభుత్వం ఏ వర్గానికి ఇచ్చిన హామీలు ఏమిటో, ఆ గడువు నాటికి జరిగిందేమిటో, జరగనిదేమిటో, తిరిగి పెడుతున్న కొత్త గడువులు ఏమిటో ఇప్పటికే విస్తారంగా మీడియాలో వెలువడ్డాయి. అంతకన్నా ముఖ్యంగా ప్రజల మధ్య ప్రతి గ్రామంలో చర్చలు సాగుతున్నాయి. అందువల్ల ఇక్కడ మరొకమారు వివరించనక్కర లేదు. ప్రభుత్వం మాత్రం అస్పష్టమైన ప్రకటనలు చేయటం మినహా, హామీల అమలుపై ఆడిటింగ్ పద్ధతిలో లెక్కలేమీ చెప్పటం లేదు. కాకపోతే రెండు మాటలు మాత్రం అనుకోవాలి. రైతు రుణమాఫీకి, 6 గ్యారంటీలలోని 13 హామీల అమలు హరీశ్ గుర్తుచేస్తున్న ఆగస్టు 15 గడువునైనా ఆమోదించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా లేరని ఇప్పుడు స్పష్టమవుతున్నది. కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల తర్వాత, స్థానిక సంస్థల ఎన్నికల గండం కూడా ఆగస్టు 15 నాటికి ముగిసే అవకాశం ఉన్నది. అయినప్పటికీ రుణమాఫీ, 13 హామీల అమలుపై ముఖ్యమంత్రికి తనపైన తనకే భరోసా ఉన్నట్టు లేదు.. అటువంటప్పుడు ఆయన పట్ల ప్రజలకెట్లా భరోసా కలగాలి? శుక్రవారం నాడు ముఖ్యమంత్రి గన్పార్క్కు రాకపోవటంతో, ఆగస్టు 15కు కూడా రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీల అమలు పూర్తిచేయలేమని చెప్పకనే చెప్పినట్టయింది.
-టంకశాల అశోక్