Congress-BJP | కంటోన్మెంట్, ఏప్రిల్ 26: కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్, బీజేపీలు దోస్తీ కట్టాయి. బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోవడమే లక్ష్యంగా తమ సిద్ధాంతాలను సైతం పక్కనపెట్టి కాషాయం, హస్తం కలిసిపోయాయి. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఓడిపోయిన వ్యక్తికే.. కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికలో టికెట్ కేటాయించడంతో వారి రహస్య చెలిమి బయటపడిందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పార్లమెంట్ స్థానాల్లోనూ కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోవడం కోసం పరిస్థితులను ఆధారంగా చేసుకుని బలహీనమైన, బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి వ్యూహాలు పన్నుతున్నాయి. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి, కిషన్రెడ్డిల వ్యూహమంటూ.. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన శ్రీగణేశ్ను కాంగ్రెస్.. పార్టీలో చేర్చుకున్నది. ఉప ఎన్నికలో తమ అభ్యర్థిగా బరిలో నిలబెట్టింది.
బీజేపీ నుంచి వెళ్లిన శ్రీగణేశ్ను బాగా వ్యతిరేకించిన స్థానిక బీజేపీ కంటోన్మెంట్ నేతలు ఎట్టకేలకు ఎన్నికల్లో ఓడించాలని శపథం చేశారు. దీంతో పాటు బీజేపీ నుంచి గట్టి వ్యక్తిని పోటీలో నిలిపి.. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్కు చుక్కలు చూపించాలని నిర్ణయించారు. కానీ పార్టీ ఆదేశాలతో వారు అనుకున్న వ్యక్తికి కాకుండా నియోజకవర్గంతో సంబంధం లేని ఆర్ఎస్ఎస్కు చెందిన ఓ డమ్మీ అభ్యర్థిని బరిలోకి దించడంతో కాషాయ నేతలు కంగుతిన్నారు. బీజేపీ అధిష్టానం కాంగ్రెస్తో లోపాయికారి ఒప్పందంతో కంటోన్మెంట్ సీటు కాంగ్రెస్కు, మల్కాజిగిరి పార్లమెంట్ సీటు బీజేపీకి అంటూ.. పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కాంగ్రెస్కు బీజేపీ సహకరించాలని, మల్కాజిగిరి పార్లమెంట్ సీటులో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సహకరించేలా రహస్య మంతనాలు జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో బీజేపీ ఎవరికీ పరిచయం లేని ఓ డమ్మీ అభ్యర్థిని కంటోన్మెంట్ బరిలో దింప డం పార్టీ శ్రేణులకు నచ్చకపోవడంతో అంతర్గతంగా వాళ్లంతా కమలం పెద్దలపై గుర్రుగా ఉన్నట్టు తెలిసింది.
బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కంటోన్మెంట్లో బీజేపీ అభ్యర్థిగా వంశా తిలక్ను పోటీలో ఉంచడంతోనే వారి రహస్య ఒప్పందం బట్టబయలైంది. మరోవైపు టికెట్ ప్రకటించిన నాటి నుంచి కనీసం ప్రచారం కూడా బీజేపీ అభ్యర్థి చేపట్టకపోవడంతో మరింత అనుమానాలకు తావిస్తోంది. కేవలం కంటోన్మెంట్ ఐదో వార్డులో ఇటీవల మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రోడ్షోలో మాత్రమే కనిపించిన వంశా తిలక్ మళ్లీ.. గురువారం నామినేషన్ దాఖలు చేసిన సమయంలోనే కనిపించడం విశేషం. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ అనుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు బీజేపీతో ఒప్పందం చేసుకుని బీఆర్ఎస్ను ఓడించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కానీ కంటోన్మెంట్ వాసులు కాంగ్రెస్, బీజేపీల జిమ్మిక్కులను ముందే గ్రహించి గులాబీ జెండానే కంటోన్మెంట్ గడ్డపై ఎగురవేస్తామని స్పష్టం చేస్తున్నారు.