‘తెలుగువారితో నాది 28ఏండ్ల బంధం. వారిని దృష్టిలో పెట్టుకొనే ఈసినిమా చేశాను. మానవబంధాలపై తీసిన గొప్ప సినిమా ఇది. నా కెరీర్లోనే ఇది ప్రత్యేకం. ‘గజనీ’ నాటి ఎనర్జీని మళ్లీ ఈ సినిమాలో చూస్తారు. సిన్సియర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి. ముఖ్యంగా తను గొప్ప రచయిత. అద్భుతమైన పాత్రలను సృష్టించారు. నిర్మాతలు ఓ అందమైన ప్రపంచాన్నే ఆవిష్కరించారు. టీమ్ అంతా ప్రేమతో పనిచేశారు. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ని తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారు. అలాగే ఈ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని అగ్ర నటుడు సూర్య అన్నారు.
ఆయన కథానాయకుడిగా రూపొందిన పాన్ ఇండియా ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితాబైజు కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో సూర్య మాట్లాడారు. దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ ‘నమ్మకంగా చెబుతున్నా. ఈ సినిమా చూస్తున్నంతసేపూ ఆడియన్ ముఖంపై చిన్న చిరునవ్వు కచ్ఛితంగా ఉంటుంది.
సినిమా ఇంతబాగా రావడానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. 20ఏండ్లుగా సూర్యసార్ సినిమాలు చూస్తూ ఎదిగాను. ఇప్పుడు ఆయనతో సినిమా చేశాను. ఇది నేను ఓ ఫ్యాన్ బోయ్గా చేసిన సినిమా’ అని చెప్పారు. ‘సూర్యసార్తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. అద్భుతమైన టీమ్తో పనిచేసే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు కృతజ్ఞతలు’ అన్నారు కథానాయిక మమితాబైజు. ఇంకా చిత్ర నిర్మాతలతోపాటు రాధిక శరత్కుమార్, కె.ఎల్.నారాయణ, మైత్రి రవిశంకర్, శాసనసభ్యులు నవీన్ యాదవ్, రామజోగయ్యశాస్త్రి, సునీల్రెడ్డి, బీవీఎస్ఎన్ రవి, విజయ్ బిన్నీ, హైపర్ ఆది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.