రేగొండ/శాయంపేట, ఆగస్టు 11 : చలివాగు ఆయకట్టుకు నీళ్లు విడుదల చేయకపోతే గురువారం తామే రైతులతో కలిసి తూము తెరిచి నీళ్లిస్తామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన కరువని ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లిలోని పరకాల-భూపాలపల్లి రహదారిపై మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆందోళనలో పాల్గొని మద్దతు తెలిపారు. అంతకుముందు హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు, దేవాదుల పంప్హౌస్ను పరిశీలించారు.
పోలీసులు అడ్డుకుని మాజీ ఎమ్మెల్యేతోపాటు కొందరినే లోపలికి అనుమతిచ్చారు. పంప్హౌస్లో నడుస్తున్న మోటర్లను, ఎత్తిపోస్తున్న నీటి నిల్వలను ఆయన పరిశీలించారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ.. యాగాలు చేస్తే నీళ్లు రావని, ప్రాజెక్టుల్లో తూములు, గేట్లు లేపితే సాగునీరు వస్తుందని తెలిపారు. రైతుల గోసెరిగి ప్రభుత్వం వెంటనే చలివాగు ప్రాజెక్టు నుంచి సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నదని, వారు కన్నెర్ర చేస్తే ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు.
వరి నార్లు పోసి 45 రోజులు కావస్తున్నా చలివాగు ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కింద అధికారికంగా 5 వేలు, అనధికారికంగా మరో రెండువేల ఎకరాల సాగు విస్తీర్ణం కలిగి ఉన్నదని అన్నారు. ఈ ప్రాంతానికి సాగునీరు విడుదల చేయకుండా స్టేషన్ఘన్పూర్, ధర్మసాగర్ ప్రాంతాలకు విడుదల చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. చలివాగు ప్రాజెక్టు ద్వారా తామే సాగు నీరు విడుదల చేస్తామని, కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టంచేశారు.