Special Trains : రాబోయే పండగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పలు మార్గాల్లో ప్రత్యేక రైలు సర్వీసులు నడిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య 16 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు శనివారం మధ్యాహ్నం ప్రకటించారు. ఈ ప్రత్యేక సర్వీసులు అక్టోబరు 6 నుంచి నవంబరు 25 వరకు ప్రతి మంగళ, బుధ వారాల్లో రాకపోకలు సాగిస్తాయని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు.
07037 నంబర్ రైలు చర్లపల్లి నుంచి అక్టోబరు 6, 13, 20, 27, నవంబరు 3, 10, 17, 24 తేదీల్లో బయల్దేరి మరుసటి రోజు శ్రీకాకుళం చేరుకుంటుంది. అలాగే 07038 నంబర్ రైలు అక్టోబర్ 7, 14, 21, 28, నవంబర్ 4, 11, 18, 25 తేదీల్లో శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ నుంచి బయల్దేరి మరుసటి రోజు చర్లపల్లికి వెళ్తుంది. అయితే ఈ రైళ్లు బయల్దేరే గమ్యస్థానానికి చేరుకొనే సమయాలను మాత్రం ఇంకా అధికారులు ప్రకటించలేదు.
ఈ ప్రత్యేక రైలు సర్వీసులు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. వీటిలో ఏసీ టూ టైర్, ఏసీ త్రీటైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి.