పోర్ట్ ఔ ప్రిన్స్ : హైతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్కు నైరుతి దిశలో ఓ ప్రైవేటు విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ విమానం శుక్రవారం సాయంత్రం 6:57 గంటలకు నగర విమానాశ్రయం నుంచి బయలు దేరింది. ఒక గంట తర్వాత హైతీ దక్షిణ తీరంలోని జాక్మెల్ చేరుకోవాల్సి ఉందని నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆఫీస్ (ఎన్సీఏఓ) తెలిపింది. ప్రమాదాన్ని హైతీ పౌర రక్షణ సమన్వయకర్త గుటెన్బర్గ్ డెస్టిన్ ధ్రువీకరించారు. విమానంలో ఉన్న ఆరుగురు మృతి చెందారని తెలిపారు. అయితే ప్రమాదానికి కారణాలు స్పష్టంగా తెలియరాలేదని అధికారులు చెప్పారు. మృతుల్లో అమెరికాకు చెందిన ఇద్దరు ఉన్నారని మిషనరీ సంస్థ గోసెల్ప్ టూ హైతీ తన ఫేస్బుక్ పేజీలో పేర్కొంది. శుక్రవారం గాల్లోకి ఎగిరిన విమానం ఎక్కడో ఒక చోట ల్యాండ్ అయి ఉంటుందని భావిస్తుండగా.. శనివారం తెల్లవారు జామున కూలిపోయినట్లుగా గుర్తించారు.