నాగర్ కర్నూల్: దాడికి పాల్పడ్డ సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మత్స్యకారులు సోమవారం నాగర్ కర్నూల్ ( Nagarkurnool ) జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గుడిపల్లి రిజర్వాయర్లో చేపలు పట్టుకునే ( Fish Hunting ) విషయంలో గత కొంతకాలంగా నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లి, నర్సాయిపల్లి, రేవల్లి మండలం గౌరీదేవి పల్లి గ్రామాలకు చెందిన మత్స్యకారుల మధ్య ఘర్షణ జరుగుతోంది.
నర్సాయిపల్లి గ్రామంలో మత్స్యకారులు లేకపోయినా రిజర్వాయర్లో భూములు కోల్పోయిన మత్స్యకారులు కాని ఇతర కులాల వారికి సైతం చేపలు పట్టుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో ఆదివారం మాట్లాడుకునేందుకు రమ్మని నర్సాయిపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ రాములు, మిగతా గ్రామస్తులు గుడిపల్లి, గౌరీదేవి పల్లి గ్రామాలకు చెందిన మత్స్యకారులను పిలిపించి చర్చలు జరిపారు.
ఈ క్రమంలో నర్సాయిపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ రాములు, గ్రామస్తులు కలిసి గుడిపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారుడు రామకృష్ణ, మరో నలుగురిపై కర్రలతో విచక్షణారహితంగా దాడులు చేశారు. అనంతరం బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ దాడిని నిరసిస్తూ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన మత్స్య కారులు సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి సర్పంచ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.