Dinner | రాత్రి భోజనం చేస్తూనే మొబైల్ ఫోన్, టీవీ లేదా ట్యాబ్లెట్ చూడటం చాలా మందికి రోజువారీ అలవాటుగా మారిపోయింది. అయితే ఈ అలవాటు జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా స్క్రీన్ల నుంచి వెలువడే బ్లూ లైట్ శరీరంలోని జీవ గడియారాన్ని (సర్కేడియన్ రిథమ్) దెబ్బతీసి, ఆహారం జీర్ణమయ్యే విధానాన్ని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మంచి జీర్ణక్రియ కోసం భోజన సమయంలో స్క్రీన్లకు దూరంగా ఉండటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. పరిశోధనల ప్రకారం, బ్లూ లైట్ కేవలం నిద్ర నాణ్యతను మాత్రమే కాకుండా జీవక్రియపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రాత్రి భోజనం సమయంలో స్క్రీన్ చూస్తూ తినడం అలవాటుగా మారితే శరీరంలోని సహజ జీవ గడియారం గందరగోళానికి గురవుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు క్రమంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. శరీరంలో జీర్ణక్రియ ఒక నిర్దిష్ట జీవ గడియారం ప్రకారం సాగుతుంది. కానీ భోజనం చేస్తూనే మొబైల్ లేదా టీవీ స్క్రీన్ చూస్తే బ్లూ లైట్ పగలు-రాత్రి సంకేతాలను మెదడుకు తప్పుగా చేరవేస్తుంది. దీనివల్ల శరీరం, మెదడు సమన్వయం దెబ్బతిని జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది.
స్క్రీన్ చూస్తూ భోజనం చేసే సమయంలో చాలామంది తినే సమయాన్ని కూడా నియంత్రించలేరు. ఇష్టమైన వీడియో లేదా సీరియల్ చూస్తూ ఉండటంతో భోజనం ఎక్కువసేపు సాగుతుంది. దీంతో జీర్ణక్రియ నెమ్మదించి కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బ్లూ లైట్ ప్రభావంతో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది నిద్రకు అవసరమైన ముఖ్యమైన హార్మోన్. మెలటోనిన్ తగ్గిపోవడం వల్ల నిద్రతోపాటు ఇన్సులిన్, జీవక్రియకు సంబంధించిన ఇతర హార్మోన్ల సమతుల్యత కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పేగులు, మెదడు మధ్య బలమైన సంబంధం ఉంటుంది. దీనిని గట్-బ్రెయిన్ కనెక్షన్ అంటారు. భోజనం సమయంలో స్క్రీన్పై దృష్టి కేంద్రీకరించడం వల్ల మెదడు ఆహారంపై పూర్తిగా దృష్టి పెట్టదు. దీంతో జీర్ణక్రియ సమర్థత తగ్గి ఆహారం సరిగా జీర్ణం కాదు. స్క్రీన్ చూస్తూ తినడం వల్ల చాలామంది తాము ఎంత ఆహారం తింటున్నారో గుర్తించలేరు. దీనిని మైండ్లెస్ ఈటింగ్ అంటారు. పరిశోధనల ప్రకారం ఇలా తినేవారిలో అవసరానికి మించి ఆహారం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బరువు పెరగడం, జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడి పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఆహారాన్ని సరిగా నమలకుండా మింగడం కూడా సాధారణంగా కనిపిస్తుంది.
మెదడు పూర్తిగా స్క్రీన్పై దృష్టి పెట్టినప్పుడు లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో జీర్ణ ఎంజైమ్లు సమర్థంగా పనిచేయలేక ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ మందగిస్తుంది. అధ్యయనాల ప్రకారం బ్లూ లైట్ ప్రభావం జీవక్రియను ఆలస్యం చేయడమే కాకుండా హార్మోన్ల సహజ చక్రాన్ని కూడా దెబ్బతీస్తుంది. అలాగే భోజనం సమయంలో దృష్టి మరలడం వల్ల ఎక్కువ కేలరీలు తీసుకోవడం, జీర్ణక్రియ సరిగా జరగకపోవడం వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. రాత్రి భోజనం త్వరగా చేయడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నిద్రపోయే సమయానికి కనీసం మూడు గంటల ముందు భోజనం ముగిస్తే జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు శరీర జీవ గడియారం సక్రమంగా పనిచేస్తుంది. రాత్రివేళ బ్లూ లైట్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆలస్యంగా భోజనం చేయడం, స్క్రీన్ చూస్తూ తినడం వల్ల కొవ్వు నిల్వలు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.
భోజనం చేసిన తర్వాత తరచూ కడుపు ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్, మల విసర్జనలో అసమానతలు, రాత్రివేళ మళ్లీ ఆకలి వేయడం వంటి సమస్యలు కనిపిస్తే డిన్నర్ అలవాట్లను ఒకసారి పరిశీలించుకోవాలి. జీర్ణక్రియను మెరుగుపరచాలంటే భోజనం సమయంలో మొబైల్, టీవీ వంటి స్క్రీన్లను పూర్తిగా పక్కన పెట్టాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయడం, ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాలు స్క్రీన్-ఫ్రీ మీల్ పాటించడం ద్వారా జీర్ణవ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.