హైదరాబాద్ : వినీలాకాశంలో బుధవారం అద్భుతం చోటు చేసుకుంది. ఇంధ్ర ధనుస్సులా ఓ వలయం ఏర్పడింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు హైదరాబాద్ నగరం, రాజన్న సిరిసిల్ల జిల్లా సహా పలు ప్రాంతాల్లో సూర్యుడి చుట్టూ వలయం స్పష్టంగా కనిపించింది. ఈ సుందర దృశ్యాన్ని చూసి ఆశ్చర్యానికి గురైన జనం తమ సెల్ఫోన్లలో బంధించారు. సాంకేతికంగా దీన్ని ‘హలోస్’గా పిలుస్తారని నిపుణులు పేర్కొంటున్నారు.
దట్టమైన మేఘాలు ఏర్పడి వాటిలో ఘనీభవించిన నీటి బింధువులపై సూర్య కిరణాలు పడినప్పుడు ఇలాంటి దృశ్యం ఆవిష్కతమవుతుందని తెలిపారు. మంచు బింధువులపై పడిన కిరణాలు పరావర్తనం చెంది ఇలా ఇంధ్ర ధనస్సు రంగుల్లో కనిపిస్తాయని చెప్పారు. సాధారణ పరిభాషలో దీన్ని వరద గూడు అని అంటారని, ఇలా ఏర్పడితే ఆ సంవత్సరమంతా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని రైతుల నమ్మకం.