హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్యలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతున్నది. 37 మంది జూనియర్ లెక్చరర్ల సర్టిఫికెట్లు నకిలీవిగా తేలడం సంచలనం సృష్టించింది. సదరు లెక్చరర్లకు నోటీసులివ్వడం చర్చనీయాంశమైంది. 16 ఏండ్ల తర్వాత నకిలీవిగా గుర్తించడం, ఇన్నాళ్లూ ఫేక్ రాయుళ్లు దర్జాగా ఉద్యోగం చేయడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకాలం అధికారులు వీరిని ఎందుకు గు ర్తించలేకపోయారన్న సందేహాలు వ్యక్తమవుతునాయి. నోటీసులు అందుకున్న వారిలో అత్యధికులు 2000-2010 మధ్యలో నియమితులైన వారే ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో కొందరు అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
నాలుగైదు సార్లు వెరిఫికేషన్..
కాంట్రాక్ట్ లెక్చరర్ల నియామకం సమయం లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఆ తర్వాత నాలుగైదు సార్లు వెరిఫికేషన్ జరిగింది. ఆర్జేడీ స్థాయిలోనూ విచారణలు జరిగాయి. జిల్లాస్థాయిలో డీఐఈవోలు సైతం వెరిఫికేషన్ చేశారు. జీవో-16 సమయంలో ను సీనియర్ ప్రిన్సిపాళ్ల కమిటీ, రెగ్యులైజేషన్ సమయంలో త్రీమెన్ కమిటీతో వెరిఫికేషన్ జరిగింది. ఇన్ని దశల్లో వెరిఫికేషన్ జరిగినా నకిలీ సర్టిఫికెట్లను గుర్తించలేకపో వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారులపై చర్యలుండేనా?
కాంట్రాక్ట్ లెక్చరర్లను ఆర్జేడీ స్థాయిలో నియమించారు. తాజాగా వారి సర్టిఫికెట్లు నకిలీవిగా తేలడంతో వారిపై చర్యలు తీసుకోవాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్యోగంలో కి తీసుకున్నవారు, సర్టిఫికెట్లను పరిశీలించినవారు, రెగ్యులరైజేషన్కు ఆమోదం తెలిపిన వారిపైనా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొందరు కావాలనే నకిలీ సర్టిఫికెట్లు ఆమోదించారని, ఈ కోణంలోనూ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లున్నాయి.
చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ
నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిని అరికట్టడంతో ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ ఆరోపించింది. ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఇన్నాళ్లూ కండ్లు మూసుకున్నారా? అంటూ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ప్రశ్నించారు.