న్యూఢిల్లీ : దేశంలో కరోనా రెండో దశలో యువతపై ప్రభావం చూపుతున్నది. థర్డ్ వేవ్ భయాల మధ్య చిన్నారులపై ప్రభావం చూపుతుందనే వార్తలపై కేంద్రం స్పందించింది. ఇప్పటివరకు పిల్లలపై ప్రభావం చూపేంతగా వైరస్లో మార్పులు కనిపించలేదని స్పష్టం చేసింది. అయితే, వైరస్ సంక్రమణ, ప్రవర్తనలో మార్పులు చోటు చేసుకుంటే పిల్లల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ హెచ్చరించారు. ఈ మేరకు పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. చిన్నారుల్లో వైరస్ సంక్రమణపై ఇప్పటికే దృష్టి పెట్టామని, సాధారణంగా పిల్లలకు వైరస్ సోకితే లక్షణాలు కనిపించవని, ఇన్ఫెక్షన్ సోకినా లక్షణాలు తక్కువగా ఉంటాయన్నారు.
ఒక్కోసారి అసలే కనిపించవని, ఇప్పటి వరకు పిల్లల్లో వైరస్ సంక్రమణ తీవ్రత ప్రమాదకరంగా ఏమీ లేదని స్పష్టం చేశారు. కేవలం 2 నుంచి 3శాతం చిన్నారులకు మాత్రమే ఆసుపత్రిలో చేర్పించే అవసరం ఏర్పడవచ్చని అంచనా వేశారు. అందుకే అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధత అవుతున్నామని.. పిల్లల్లో కొవిడ్-19 ఇన్ఫెక్షన్ను సమీక్షించేందుకు జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నాలుగైదు నెలల ముందు అందుబాటులో లేని సంకేతాలను బృందం పరిశీలించిందన్నారు. అందుబాటులో ఉన్న డేటా, క్లినికల్ ప్రొఫైల్, దేశ అనుభవం, వైరస్ స్వభావాన్ని పరిశీలిస్తూ.. ప్యానెల్ మార్గదర్శకాలను రూపొందించిందన్నారు.
త్వరలోనే వాటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. పిల్లల్లో కరోనా ప్రభావం రెండు రకాలుగా ఉంటుందని చెప్పారు. దగ్గు, జ్వరం, జలుబు, శ్వాస సమస్య, న్యుమోనియా సహా పలు లక్షణాలుంటాయని, వీరిని ఆసుపత్రిలో చేర్పించాల్సి ఉంటుందన్నారు. కరోనా బారినపడి కోలుకున్న తర్వాత కొందరు చిన్నారుల్లో 2-6 ఆరు వారాల తర్వాత మళ్లీ జ్వరం, శరీరంపై దద్దుర్లు, కళ్లల్లో మంట, శ్వాసకోశ, డయేరియా వంటి సమస్యలు తలెత్తవచ్చన్నారు. ఇన్ఫెక్షన్ సోకినప్పటికీ ప్రమాద తీవ్రత తక్కువేనని తెలిపారు. ఇలాంటి సమయంలో చిన్నారులు వైరస్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వీకే పాల్ సూచించారు.