దుబాయి : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2024-2031 మధ్య ఎనిమిదేళ్ల కాలానికి సంబంధించిన ఫ్యూచర్స్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్ను మంగళవారం ప్రకటించింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై టీ-20 వరల్డ్ కప్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న తరహాలోనే రెండేళ్లకోసారి నిర్వహించాలని నిర్ణయించగా.. ఇందులో 20 జట్లను తీసుకురానుంది. అలాగే 50 ఓవర్ల వన్డే ప్రపంచ కప్ టోర్నీని 14 జట్లతో ఆడించాలని, ప్రస్తుతం రెండు ఎడిషన్లుగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీల స్థానంలో నాలుగు ఎడిషన్లలో జరపాలని నిశ్చయించింది.
వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 14 జట్లతో 2027, 2031లో ప్రపంచకప్ జరుగనుండగా.. వీటిల్లో మొత్తం మ్యాచుల సంఖ్య 54కి పెరగనుంది. 2019 చివరిసారిగా జరిగిన వరల్డ్ కప్లో కేవలం కేవలం 10 పది జట్లు మాత్రమే పాల్గొన్నాయి. 2024, 2026, 2028, 2030లో జరిగే టీ20 వరల్డ్ కప్లో 20 జట్లతో జరుగనుండగా.. మొత్తం మ్యాచ్ల సంఖ్య 55కి పెరుగనుందని ఐసీసీ పేర్కొంది. ఎనిమిది జట్లతో నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీని ప్రతి నాలుగేళ్లకోసారి.. అనగా 2025, 2029లో జరపనున్నారు. ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్స్ను ప్రతి రెండేళ్లకోసారి.. 2025, 2027, 2029, 2031లో నిర్వహించనుంది.
వరల్డ్ కప్ ఫార్మాట్
పురుషుల ప్రపంచకప్ ఫార్మాట్ను ఐసీసీ వివరించింది. ప్రస్తుతం 10 జట్లు పాల్గొంటుండగా.. భవిష్యత్లో 14 టీమ్లతో జరపాలని నిర్ణయించింది. 14 జట్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు. ఇందులోని ప్రతి గ్రూప్లో టాప్-3లో ఉన్న జట్లను సూపర్ సిక్స్గా పరిగణించనున్నారు. ఆ తర్వాత సెమీస్, ఫైనల్స్ నిర్వహిస్తారు. 2003 ప్రపంచకప్లో ఇదే పద్ధతి పాటించారు. టీ20 ప్రపంచకప్లో 20 జట్లు పాల్గొననుండగా.. జట్లను నాలుగేసి గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్లో ఐదేసి జట్లు ఉండనున్నాయి. ఇందులో ప్రతి గ్రూప్లో టాప్-2లో నిలిచిన జట్లను సూపర్-8గా పరిగణిస్తారు. ఆ తర్వాత నాకౌట్ దశ, సెమీస్, ఫైనల్స్ నిర్వహిస్తారు. చాంపియన్స్ ట్రోఫీని గతంలో లాగే నిర్వహిస్తారు. ఎనిమిది టీమ్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. తర్వాత సెమీస్, ఫైనల్స్ నిర్వహిస్తారు.