హైదరాబాద్, జూన్1 (నమస్తేతెలంగాణ): కరోనా విపత్కర పరిస్థితుల్లో సాయం అడిగిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు, సినీ నటుడు సోనూసూద్ రియల్ హీరోలు అనిపించుకొంటున్నారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా వీరిద్దరు చేసుకొన్న ట్వీట్స్ ఆసక్తికరంగా మారాయి. ముందుగా మంత్రి కేటీఆర్ ‘నేను ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని కాబట్టి ప్రజలకు సేవ చేయటం నా బాధ్యత. కానీ ఆపదలో ఉన్నవారికి నిస్వార్థంగా సేవ చేస్తున్న సోనూసూద్ సూపర్ హీరో’ అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. వెంటనే స్పందించిన సోనూసూద్ ‘మీ మాటలకు కృతజ్ఞుడిని సర్. తెలంగాణ కోసం ఎంతోచేస్తున్న మీరు నిజమైన హీరో. మీ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. నేను తెలంగాణను నా రెండో ఇంటిగా భావిస్తాను. అది నేను పనిచేసే చోటు. అక్కడి ప్రజలు నాపై ఎన్నో ఏండ్లుగా ప్రేమ చూపిస్తున్నారు’ అంటూ రీట్వీట్ చేశాడు.
సినీనటుడు సోనూసూద్ రీట్వీట్కు మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘కృతజ్ఞతలు బ్రదర్! మీరు ప్రారంభించిన గొప్ప పనిని ఇలాగే కొనసాగించండి. మీరు లక్షలాది మందికి ఆదర్శం’ అని వ్యాఖ్యానించారు. ‘తప్పకుండా బ్రదర్. ఈ మిషన్ను నేను కొనసాగిస్తాను. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలనుకొంటున్నాను. మీరు ఎంతోమందికి ఆదర్శం’ అని సోనూసూద్ మరో ట్వీట్ చేశాడు. దీనికి కేటీఆర్.. ‘మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు చూడాలని అనుకుంటున్నా’ అని అన్నారు. దీనికి సోనూసూద్ ‘నేనూ అలాగే అనుకుంటున్నాను సర్. వచ్చేప్పుడు ముంబై నుంచి మీకు మంచి ఫుడ్ తీసుకొనివస్తా. మీరు నా కోసం హైదరాబాద్ బిర్యానీ రెడీగా పెట్టండి’ అంటూ రిైప్లె ఇచ్చారు.
ట్విట్టర్లో మంత్రి కేటీఆర్, సినీనటుడు సోనూసూద్ మధ్య సంభాషణపై నెటిజన్లు ఫిదా అయ్యారు. ‘సర్ మీరు ఇద్దరు ఒకే చోట కలుస్తానంటే చాలా ఆత్రుతగా ఉంది. దయచేసి ఒక్కరోజు ముందు నాకు సమాచారం ఇవ్వండి. ప్రస్తుత పరిసిత్థుల్లో అండగా నిలుస్తున్న మీ ఇద్దరు రియల్ హీరోస్ (ఒకరు రాజకీయరంగం నుంచి, మరొకరు సినీరంగం నుంచి)తో ఫొటోషూట్ చేస్తా అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఇద్దరి అభిమానులు వారిని కొనియాడుతూ ట్వీట్లు చేశారు.