హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ ఫైర్ ఎన్వోసీలు తీసుకుని కళాశాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఫేక్ ఎన్వోసీలపై ఏసీబీతో విచారణ జరిపించాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను హైందవి కళాశాల చైర్మన్ గడ్డం శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. తాను 2025లో ఫైర్ ఎన్వోసీ సర్టిఫికెట్ తీసుకుని దాంతో బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్కు దరఖాస్తు చేసుకున్నానని, అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. తాను రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు నిరూపిస్తే చంచల్గూ డ జైలుకు పోవడానికైనా సిద్ధమేనని చెప్పారు. అసలు తనపై ఫిర్యాదుచేసే అధికారం హైడ్రాకు ఎక్కడిదని, తాను జీహెచ్ఎంసీ నుంచి 2025లో సర్టిఫికెట్ తీసుకున్నానని, హైడ్రాకు ఈ విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. తాను బీఆర్ఎస్ నేతను కాబట్టే వేధిస్తున్నారని, ఈ నకిలీ కుంభకోణం వెనక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి వారిపై కేసులు పెట్టాల్సిందిపోయి కళాశాలలను టార్గెట్ చేసి వేధించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.