ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 8: కాంగ్రెస్ ప్రభుత్వతీరుతో రోడ్డున పడుతున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసాగా నిలుస్తున్నారని ఆటోయూనియర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవాధ్యక్షుడు బొల్లి రామ్మోహన్ కొనియాడారు. నాలుగు నెలల క్రితం ఎల్లారెడ్డిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బొప్పాపూర్కు చెందిన ఆటో డ్రైవర్ బొమ్మనవేణి రాజు మృతి చెందగా కేటీఆర్ చొరవతో బీఆర్ఎస్ పక్షాన జిల్లాలోని ఆటో డ్రైవర్లందరికీ ఇన్సూరెన్స్ చేయించిన విషయం తెలిసిందే. శనివారం రాజు కుటుంబానికి రూ.5లక్షల ప్రమాద బీమా మంజూరుకాగా ఆటోడ్రైవర్లతో కలిసి గొల్లపల్లి బస్టాండ్ నుంచి రాజు ఇంటి వరకు కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ నినాదాలిస్తూ ర్యాలీగా వెళ్లి బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణహరి, ఆటోయూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజు, సర్పంచ్ గీతాంజలి, నాయకులు ఉన్నారు.