హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం చేస్తున్నవారికి సంస్థ శుభవార్త చెప్పింది. బ్రెడ్ విన్నర్, మెడికల్ ఇన్వాలిడేషన్ పథకాల కింద కన్సాలిడేటెడ్ పేపై నియమితులైన ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిస్తూ ఎండీ వై నాగిరెడ్డి తాజాగా సర్యులర్ జారీ చేశారు. ఆగస్టు 12 నాటి కార్పొరేషన్ బోర్డు తీర్మానం ప్రకారం.. కన్సాలిడేటెడ్ పేపై పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను ఆ తేదీ నుంచే క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు.
బోర్డు ఆమోద తేదీ నాటికి 2 సంవత్సరాల సేవ, ప్రతి ఏటా 240 రోజులు పనిచేయాలనే నిబంధనతో సంబంధం లేకుండా అర్హులైన ఉద్యోగుల సేవలను తక్షణమే క్రమబద్ధీకరించాలని అపాయింటింగ్ అథారిటీస్ను ఎండీ ఆదేశించారు. ఇకపై బ్రెడ్ విన్నర్, మెడికల్ ఇన్వాలిడేషన్ పథకాల కింద చేపట్టే నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికన చేయాలని స్పష్టంచేశారు. ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవు, అనారోగ్యం లేదా గైర్హాజరులో ఉన్న ఉద్యోగుల సేవలు వారు విధుల్లో చేరిన తేదీ నుంచి క్రమబద్ధీకరించబడుతాయని చెప్పారు.