హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తేతెలంగాణ): రంగారెడ్డి జిల్లాలోని బహదూర్గూడ, తిమ్మాపూర్లో భూవ్యవహారాలపై విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్రెడ్డి ప్రకటించారు. తాము అక్రమంగా భూ ములను సంపాదించుకున్నామని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు. తమను బెదిరించినా, బద్నాం చేసినా భయపడబోమని, దగాపడ్డ బహదూర్గూడ రైతుల తరుఫున పో రాటం ఆపేదిలేదని స్పష్టంచేశారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం అసెంబ్లీలో సీఎం చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. తనకు ఆ భూముల వ్యవహారాల్లో సంబంధం ఉన్నట్టు సీఎం మాట్లాడటం బాధ కలిగించిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేండ్ల నుంచి తమ కుటుంబంపై విచారణలు కొనసాగిస్తున్నారని, ఇవేమీ కొత్తకాదని స్పష్టంచేశారు.
తనకు సోనియాగాంధీ దయాదాక్షిణ్యాలపైనే ఎంపీ టికెట్ వచ్చిందని కార్తీక్రెడ్డి తేల్చిచెప్పారు. తనకు ఎంపీ టికెట్ ఇచ్చినట్టు స్పీకర్ ప్రసాద్కుమార్ వచ్చి అనంత పద్మనాభస్వామి వద్ద ప్రమాణం చేయగలరా? అని సవాల్ విసిరారు. టికెట్ రాకుండా అడ్డుకొనే కాంగ్రెస్ నేతలు తన ఓటమిలో భాగస్వాములయ్యారని ఆరోపించారు. ‘పార్టీలోకి మధ్యలో వచ్చిన రేవంత్రెడ్డి.. మా కుటుంబానికి కాంగ్రెస్తోనే రాజకీయ గుర్తింపు వచ్చిందని మాట్లాడటం విడ్డూరంగా ఉన్నది’ అని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపులో తమ కుటుంబం పాత్రలేదా? తమ శ్రమలేదా? అని నిలదీశారు. ‘2014లో మా అమ్మ త్యాగం చేస్తే నాకు టికెట్ ఇచ్చారు. 2018లో నేను త్యాగం చేస్తే మా అమ్మకు టికెట్ ఇచ్చారని స్పష్టంచేశారు. కాంగ్రెస్లోని అన్ని కుటుంబాలకు రెండు టికెట్లు ఇచ్చి మాకు మాత్రం అన్యాయం చేశారు’ అని ఆరోపించారు. నాటి కాంగ్రెస్ నేతల కుట్రలు భరించలేకే బయటకు వచ్చామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ప్రజలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు తమ కుటుంబం గురించి తెలుసని స్పష్టంచేశారు.
బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకోసం ఇచ్చిన నోటిఫికేషన్లో బహదూర్గూడలో చాలామంది భూములు సర్వేనంబర్లు ఉన్నాయని, కానీ, అక్కడే ఉన్న కాంగ్రెస్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఫామ్హౌస్కు చెందిన 242, 243, 248, 224, 225, 226,227,229,233,247, 248, 245, 250 సర్వేనంబర్లు మాత్రం ఎందుకు లేవని కార్తీక్రెడ్డి ప్రశ్నించారు. ఆయనకు చెందిన 13 సర్వేనంబర్లలో భూసేకరణ ఎందుకు జరుగడం లేదు? అని నిలదీశారు. పేదల భూములు గుంజుకుంటున్న కాంగ్రెస్ సర్కార్.. సొంత పార్టీ నేతల భూములను ఎందుకు ముట్టుకోవడం లేదని నిలదీశారు. ఇది కాంగ్రెస్ సర్కార్ విధానమా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రజలు ఇలాంటి అన్ని విషయాలను గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి మాజీ మంత్రులైన తన తల్లి సబిత, సునీత గురించి కొన్ని అంశాలు చెప్పార ని, కానీ వారికి అసెంబ్లీ బయట జరిగి న అవమానంపై పశ్చాత్తపం వ్యక్తంచేయకపోవడం ఆక్షేపణీయమని కార్తీక్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ బయట వారిద్దరూ ఇబ్బందులు పడ్డారా? లేదా? అన్న విషయంపై సీఎం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పీకర్ గురించి మాట్లాడిన ఆయన.. ఆ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పైగా వారిపై ఓ మంత్రితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుచితంగా మాట్లాడలేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంలో రేవంత్రెడ్డి భాగస్వామ్యం ఉన్నదని గట్టిగా నమ్ముతున్నామని స్పష్టంచేశారు.