వెల్గటూర్, సెప్టెంబర్ 18 : బీఆర్ఎస్ కార్యకర్తలు మనో ధైర్యం కోల్పోవద్దని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలాధ్యక్షుడు సింహాచలం జగన్ ఆత్మహత్య చేసుకోగా.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం హైదరాబాద్లోని కేటీఆర్ నివాసంలో ఆయనను కలిసి, జగన్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను వివరించారు.
దీంతో కేటీఆర్ స్పందిస్తూ జగన్ కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10 లక్షలు అందిస్తూ, పార్టీ పరంగా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఇబ్బందులు ఉంటే తమతో చెప్పుకోవాలని సూచించారు. మనోదైర్యాన్ని కోల్పోయి కుటుంబాలకు దూరం కావొద్దని విజ్ఞప్తి చేశారు.