న్యూఢిల్లీ : కరోనా బారినపడిన మృతి చెందిన ఉపాధ్యాయుడు నితిన్ తన్వర్ కుటుంబానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రూ.కోటి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా నితిన్ సేవలను కొనియాడారు. ప్రభుత్వం తరఫున సాధ్యమైనంత వరకు సహాయం అందిస్తానని పేర్కొన్నారు. నితిన్ తన్వర్ ఉపాధ్యాయుడిగా అంకితభావంతో సేవలందించారని కొనియాడారు. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసిన నితిన్ తన్వర్ కరోనా సంక్షోభ సమయంలో రేషన్ పంపిణీ కేంద్రంలో, ఆ తర్వాత మరికొన్ని చోట్ల సేవలందించాడు. ఈ క్రమంలో కరోనా బారినపడి మృతి చెందాడు. దీంతో గతంలో హామీ మేర అతని కుటుంబానికి రూ.కోటి చెక్కును సీఎం కేజ్రీవాల్ అందజేశారు.
నితిన్ లాంటి వ్యక్తుల వల్లనే ఢిల్లీ కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోగలదని, ప్రజలు వైరస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు 50వేల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తామని సీఎం అర్వింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు. భర్త మరణిస్తే భార్యకు నెలకు రూ.2,500 చొప్పున పెన్షన్ ఇస్తామని సీఎం చెప్పారు. పెళ్లి కాని వారు మరణిస్తే నెలవారీ పెన్షన్ను మృతుడి తల్లిదండ్రులకు ఇస్తామని తెలిపారు. తల్లిదండ్రులిద్దరూ మరణిస్తే వారి పిల్లలకు ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున పెన్షన్ ఇస్తామని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.