హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ 80వ జన్మదినోత్సవ వేడుకలను వంశీ గ్లోబల్ అవార్డ్స్, సంతోషం ఫిలిం న్యూస్, అమెరికా గానకోకిల శారద ఆకునూరి సంయుక్త ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఆన్లైన్ వేదికగా జరుగనున్నాయి. చంద్రమోహన్ నటనా వైదుష్యాన్ని 14 దేశాలు (భారత్, అమెరికా, కెనడా, యూకే, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉంగాండా, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఒమన్, ఖతర్, అబుదాబి, న్యూజీలాండ్) నుంచి రచయితలు ఆయన నటించిన 108 చిత్రాలపై పది నిమిషాల చొప్పున ప్రసంగించనున్నారు. వంశీ రామరాజు, సురేష్ కొండేటి, శారద ఆకునూరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని శనివారం ప్రముఖ చలనచిత్ర దర్శకుడు రేలంగి నరసింహారావు ప్రారంభించనున్నారు.
ఆదివారం రోజున రెండు గంటలకు ప్రారంభమయ్యే సభను మండలి బుద్ధ ప్రసాద్ ప్రారంభిస్తారు. సీనియర్ నటి సమునా రమణారావు, కళాతపస్వి కే విశ్వనాథ్ ఆశీస్సులు అందించనున్నారు. అంతే కాకుండా ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత, మాజీ ఎంపీ ఎం మురళీమోహన్, సినీ గేయ రచయిత భువనచంద్ర, చంద్రమోహన్ సతీమణి, ప్రముఖ రచయిత జలంధర చంద్రమోహన్, అమెరికాకు చెందిన ఉపేంద్ర చివుకుల తదితరులు పాల్గొననున్నారు. ఈ చారిత్రక కార్యక్రమం తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో నమోదు కాబోతున్నదని వెంకటాచారి తెలిపారు. రెండు రోజుల్లో సుమారు 20 గంటల పాటు జరిగే కార్యక్రమాన్ని అమెరికా నుంచి శారద ఆకునూరి, రాధికా నోరి, హాంకాంగ్ నుంచి జయ పీసపాటి, హైదరాబాద్ నుంచి శిరోమణి వంశీ రామరాజు నిర్వహించనున్నారు.
చంద్రమోహన్గా ప్రసిద్ధి చెందిన మల్లంపల్లి చంద్రశేఖరరావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఆయన తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి కథానాయకుడిగా, సహాయ నటుడిగా, హాస్యనటునిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ప్రధానంగా ఆయన పోషించిన హాస్య ప్రాతలు చిరకాలం ప్రేక్షకులకు గుర్తుండి పోతాయి. కొత్త హీరోయన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ను పేర్కొంటారు. ఆ కాలంలో ఆయనతో నటించిన ఎందరో కథానాయికలుగా నటించి అగ్రస్థానాన్ని చేరుకున్నారు. శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరితో పాటు పలువురు హీరోయిన్లుగా ఆయన సరసన నటించిన వారే. చంద్రమోహన్ నటించిన చిత్రాల్లో సుఖ దుఃఖాలు, పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి భారీ విజయాన్ని సాధించాయి.