కొండాపూర్, జూలై 31: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని బీరు కంపెనీలు, టైర్ల పరిశ్రమలు వదిలే కలుషిత నీరు, దుర్గంధంతో మల్లేపల్లి పరిసర ప్రాంతాల్లోని పంటలు, చెరువు కాలుష్య కాసారంగా మారాయి. పొలూష్యన్, నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని గొల్లపల్లి, సీహెచ్ గోప్లారం, తేర్పోల్, ఎదురుగూడెం, మల్లేపల్లి గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమై నేడు పంటలు కూడా పండటం లేదు. రైతుల కడుపు కొట్టే పరిశ్రమలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పరిశ్రమల నుంచి విడుదలయ్యే పొగ మంచులాగా పడి పంటలను పూర్తిగా నాశనం చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పరిశ్రమలు వదిలే వేలాది లీటర్ల మురుగు వల్ల మల్లేపల్లి చెరువు,మల్కాపూర్ పెద్ద చెరువు కలుషితమయ్యే ప్రమాదం లేకపోలేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోయారు. చర్యలు తీసుకోవాల్సి అధికారులు పరిశ్రమల యజమానులకే వత్తాసు పలకడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పచ్చని పంట పొలాలు, చెట్లు ఎండిపోయి దుర్వాసన వెలువడుతోంది. కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధులు విస్తరించడంతో ప్రజలు దవాఖానల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు కూడా కాలుష్యం కారణంగా మల్లేపల్లి చెరువులో చేపలు మృత్యువాత పడ్డాయి. అలాగే ఆ నీటిని తాగడంతో మూగజీవాలు సైతం ప్రాణాలొదిలాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పం దించి కాలుష్యం వెదజల్లుతున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. కాలుష్యం కారణంగా పంటలు సరిగ్గా పండటం లేదు.కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలపై అధికారులు చర్యలు తీసుకోవాల్సి పోయి వారికే వత్తాసు పలుకుతున్నారు.కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యాలపాలై దవాఖానల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. కంపెనీ యాజమాన్యాలపై అధికారులు చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలి.
– సీహెచ్ ఆంజనేయులు, గొల్లపల్లి,(సంగారెడ్డి జిల్లా)