సిటీ బ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): జలమండలిలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న మీటర్ రీడర్ల భవితవ్యం అంధకారంలోకి వెళ్తున్నది. నామమాత్రపు వేతనాలతో పదేండ్లకు పైగా జలమండలినే నమ్ముకుని పనిచేస్తున్న 673 మంది రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. చాలీచాలని వేతనాలతో నగరంలోని ప్రతి ఇంటికీ తిరిగి మంచినీటి బిల్లులు వసూలు చేస్తూ జలమండలి ఆర్థిక పురోగతికి తోడ్పడ్డారు. అయితే తక్కువ జీతాలతో ఎక్కువ ఆదాయం సమకూర్చుతున్న మీటర్ రీడర్లను తొలగించేందుకు జలమండలి ఉన్నతాధికారులు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. జలమండలి అధికారులు బోర్డులో ఉన్న ఇతర సమస్యలను పక్కనపెట్టి చిరుద్యోగులైన మీటర్ రీడర్లను ఇబ్బందులకు గురి చేసే పనిలో నిమగ్నమయ్యారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వారిని తొలగించాలనుకోవడం కక్ష సాధింపుగా ఉన్నదని ఆరోపణలు వస్తున్నాయి.
బోర్డుకు ఆదాయం పెంచాలనే నెపంతో పొదుపు పేరిట తక్కువ జీతానికే పనిచేస్తున్న మీటర్ రీడర్లను తొలగించి కమీషన్ ఆధారిత విధానం తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే టెండర్లు సైతం … ఆహ్వానించి ఏజెన్సీ ద్వారా బిల్లులు వసూలు చేయాలని జలమండలి భావిస్తున్నది. వారి జీతాలను సైతం నిలిపేసి తొలగించేందుకు కసరత్తు చేస్తున్నది. ఈనేపథ్యంలో ఉపాధి కోల్పోతామనే మనస్థాపంతో మీటర్ రీడర్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వరుసగా ధర్నాలు, నిరసనలు చేపట్టినా అధికారులు స్పందించకపోవడంతో ఇప్పటికే ఇద్దరు కార్మికులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. మరింత మంది ప్రాణాలు పోకముందే ఎండీ, జేఎండీ సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
పదేండ్లకు పైగా జలమండలికి సేవలందిస్తున్న మీటర్ రీడర్లను అకారణంగా రోడ్డున పడేయొద్దని కోరుతున్నారు. విధుల్లోకి తీసుకునేటప్పుడు ఔట్ సోర్సింగ్ అని చెప్పి.. ఇప్పుడేమో ‘యాక్టివిటీ’ అనే పదాన్ని చేర్చి తమను విధుల్లోంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు తీసుకునే అనాలోచిత నిర్ణయాలతో 673 మంది జీవితాలు ప్రశ్నార్థకం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలమండలిలోని అన్ని విభాగాల సిబ్బంది కంటే తక్కువ జీతంతో సేవలందిస్తున్నా, తొలగించడం వెనుక మర్మమేమిటో అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. అన్ని విభాగాల్లోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది లాగానే తమను కూడా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జలమండలి ఎండీ అశోక్రెడ్డి, పురపాలక శాఖ మంత్రి, సీఎం రేవంత్రెడ్డి స్పందించి తమకు అన్యాయం చేయాలని కోరుతున్నారు. మరింత మంది ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడకముందే ఎండీ, జేఎండీ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
మీటర్ రీడర్లను తొలగించేందుకు జలమండలి ప్రయత్నాలు చేస్తున్నదని ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చేస్తున్న నిరసనల నేపథ్యంలో జలమండలి ఒక ప్రకటన విడుదల చేసింది. మీటర్ రీడర్లను తొలగించడం లేదని, ఈ అంశంపై తప్పుడు ప్రచారం నమ్మొద్దని స్పష్టం చేసింది. ఈ అంశంపై మంగళవారం ప్రభుత్వ స్థాయిలో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. గతంలో ఇచ్చిన టెండర్లను కూడా నిలిపివేస్తున్నట్లు వివరించింది. పెండింగ్ జీతాలను సైతం త్వరలోనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.