న్యూఢిల్లీ, మే 21: దేశీయ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’కు చెందిన సిటా పీఎస్ఎస్ ప్యాసింజర్ సర్వీస్ సిస్టమ్పై భారీ సైబర్ దాడి జరిగింది. దాదాపు 45 లక్షల మంది ప్రయాణికుల వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ దుండగులు దొంగిలించారు. లీకైన సమాచారంలో ప్రయాణికుల పాస్పోర్ట్ వివరాలు, అడ్రస్, టికెట్ సమాచారం, క్రెడిట్ కార్డ్ వివరాలు వంటివి ఉన్నట్టు ప్రయాణికులకు పంపిన ఓ లేఖలో ఎయిరిండియా స్వయంగా వెల్లడించింది. ప్రయాణికుల సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దొంగిలించినట్టు ఫిబ్రవరి 25వ తేదీన గుర్తించామని, అయితే, దానికి సంబంధించిన వివరాలు మార్చి 25, ఏప్రిల్ 5 తర్వాతనే తెలిసినట్టు సంస్థ వివరించింది. ‘ఎస్ఐటీఏ పీఎస్ఎస్ ప్యాసింజర్ సర్వీస్ సిస్టమ్ (సర్వర్)’పై దాడి జరిగిందని తెలియగానే నిపుణుల సాయంతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది. సర్వర్ పాస్వర్డ్లను కూడా మార్చినట్టు తెలిపింది. ప్రయాణికులు కూడా తమ లాగిన్ క్రెడెన్షియల్స్, మనీ పేమెంట్ కార్డుల పాస్వర్డులను మార్చుకోవాలని సూచించింది. అయితే, సైబర్ దాడికి ఎవరు పాల్పడ్డారన్న విషయాన్ని వెల్లడించలేదు.
ఎంతమంది వివరాల్ని దొంగిలించారు?
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45 లక్షల మంది ప్యాసింజర్ల వివరాల్ని..
ఎవరి వివరాలు లీకయ్యాయి?
26 ఆగస్టు 2011-20 ఫిబ్రవరి 2021 మధ్య రిజిస్టర్ అయినవారు, టికెట్ బుక్ చేసుకున్నవారు.
ఎలాంటి సమాచారం లీక్ అయింది?
ప్రయాణికుడి పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్, అడ్రస్, పాస్పోర్ట్ వివరాలు, టికెట్ సమాచారం, స్టార్ అలయన్స్-ఎయిరిండియా విమానాల్లో తరచూ ప్రయాణించిన వారి వివరాలు (పాస్వర్డ్ సమాచారం లీక్ కాలేదు), క్రెడిట్ కార్డ్ వివరాలు.