హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొన్నది. ప్రముఖ సినీ నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు కన్నుమూశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సినిమా జర్నలిస్టుగా కేరీర్ను ప్రారంభించారు బీఏ రాజు. మహేశ్బాబు, నాగార్జునతో పాటు పలువురు అగ్ర హీరోలు, యువ హీరోలకు, దాదాపు 1500 సినిమాలకుపైగా సినిమాలకు పీఆర్ఓగా పని చేశారు. 2003లో ఆయన నిర్మాతగా మారి ఆయన భార్య బీ జయ దర్శకత్వం వహించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్లీ, సవాల్, వైశాఖం వంటి చిత్రాలను నిర్మించారు. ‘సూపర్ హిట్’ సినీపత్రికను నడిపారు. 2018లో బీఏ రాజు భార్య, దర్శకురాలు జయ కూడా కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.