హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమలుచేస్తున్న ఆన్లైన్ క్లాసులు, డిజిటల్ విద్యాబోధన అద్భుతంగా ఉన్నదని కేంద్రం కొనియాడింది. ఆన్లైన్లో పాఠాలు, యూట్యూబ్ పాఠాలు, ఫోన్ మానిటరింగ్, వాట్సాప్లో ప్రశ్నలసాధన, ఇంటింటికీ తిరిగి వి ద్యార్థుల చదువులను పర్యవేక్షణ చేయడం బాగుందని కేంద్ర విద్యాశాఖ కితాబునిచ్చింది. కొంతమంది టీచర్లు ప్రత్యేకంగా సృజనాత్మకం గా బోధించడం బాగున్నదని, వాటి డాక్యుమెంటేషన్లు తమకు అందజేయాలని కోరింది. వచ్చే విద్యాసంవత్సానికి మధ్యాహ్న భోజనం సహా సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టబోయే కార్యక్రమాలకు నిధులు మంజూరుచేసే ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ ఆమోదిత మండలి సమావేశాన్ని శుక్రవారం వర్చువల్గా నిర్వహించారు. తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, డైరెక్టర్ శ్రీదేవసేన సహా ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణలో కార్యక్రమాలను వివరించారు.
బడ్జెట్కు కోత!
ఈ ఏడాది ఎస్ఎస్ఏ బడ్జెట్కు కోతపడే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. గతేడాది రూ.1,467 కోట్లకు కేంద్రం ఆమోదం తెలపగా, ఈ ఏడాది బడ్జెట్ను పెంచొద్దని కేంద్ర విద్యాశాఖ అధికారులు షరతు విధించారు. ఈ నిధుల్లో కేంద్రం, రాష్ట్రం 60 ః 40 వాటాలో నిధులు ఖర్చుచేయాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ అధికారులు రూ.3 వేల కోట్లకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. గతేడాది బడ్జెట్ కన్నా కొద్దిగా తగ్గే అవకాశాలున్నట్టు అధికారులు చెప్తున్నారు. కరోనాతో స్కూళ్లు నడిచే అవకాశం లేకపోవడంతో కొన్ని అంశాల్లో బడ్జెట్కు కోత విధించొచ్చని తెలుస్తున్నది. కేజీబీవీలు, హాస్టళ్లు నడవకపోవడంతో రూ.100 నుంచి 150 కోట్ల వరకు కోతపడే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు.